తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగ ఆషాడం బోనాలు. పట్నమంతా లష్కర్ బోనాల సందడి నెలకొంది. ఆషాడం బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని పాతబస్తీలోని అమ్మవారి ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా అలంకరించారు. రంగు రంగుల విద్యుత్ దీపాలు, తీరు తీరు రంగులతో అందంగా అలంకరించారు. హైదరాబాద్ బోనాల్లో ప్రత్యేకమైనది పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారు. ఈ ఆలయం 117 వ వార్షికోత్సవాలు జులై 11నుండి ప్రారంభించారు. ఈ మేరకు ఆలయ కమిటీ చైర్మన్ బి. మారుతి యాదవ్ ఉత్సవ వివరాలను వెల్లడించారు. ప్రతినిత్యం వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహించనున్నామన్నారు.
ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ ముఖ్య అతిథులుగా హాజరై శిఖర పూజ, ధ్వజారోహణం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి..సివి. ఆనంద్. జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా శిఖర పూజ, ధ్వజారోహణలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బోనాల పండుగ. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో బోనాల పండుగ ప్రశాంతంగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ డిసిపి స్నేహమెహ్రా జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ వెంకన్న తో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.