రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో, ప్రయాణికుల రద్దీ దృష్ట్రా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉండే రూట్లలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు ముఖ్యమైన మార్గాల్లో మొత్తం 48 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.
రోజురోజుకూ పెరుగుతున్న రైల్వే ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు, వారికి ఇబ్బందులను తగ్గించి, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో 48 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు తిరుపతి-హిసార్ మధ్య 12 సర్వీసులను నడపనున్నట్టు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈ మార్గంలో నడిచే రైళ్లు ప్రతి బుధ, ఆదివారాల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని రైల్వేశాఖ పేర్కొంది. అదే విధంగా, కాచిగూడ-తిరుపతి మధ్య కూడా ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మార్గాల్లో ప్రతి గురు, శుక్రవారాల్లో 8 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించిననున్నారు.
ఇక రైల్వేశాఖ నడపనున్న ప్రత్యేక రైళ్లలో అత్యధికంగా నరసాపూర్-తిరువణ్ణామలై మార్గంలో 16 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నారు. ఈ మార్గాల్లో బుధ, గురువారాల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులన్ని జులై 9 నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వేశాఖ స్పష్టం చేసింది.
అయితే ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేందుకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా రైల్వే శాఖ కల్పించింది. ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ సూచించారు. ట్రైన్ టైమింగ్స్, ఇతర పూర్తి వివరాల కోసం రైల్వేశాఖ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు తెలిపారు.