ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఉ.10గంటలకు ఉండవల్లి నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయల్దేరి నంద్యాల జిల్లా సున్నిపెంటలో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో 11.00 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. అనంతరం శ్రీ మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. మ.12 గంటలకు శ్రీశైలం ప్రాజెక్ట్ వద్దకు చంద్రబాబు చేరుకుంటారు. జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి దిగువన నాగార్జునసాగర్కు నీరు విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం నీటి వినియోగ సంఘాల ప్రతినిధులతో భేటీ అవుతారు. అక్కడి నుంచి మ.2:30 గంటలకు అమరావతి చేరుకుంటారు చంద్రబాబు.
కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. ప్రస్తుతం డ్యాం నిండుకుండలా దర్శనమిస్తోంది. నీటి నిల్వ 193.40 టీఎంసీలు ఉండగా.. నీటిమట్టం 880.80 అడుగులకు చేరింది. భారీ వరద కొనసాగుతుందన్న అంచనాతో.. డ్యాం భద్రత దృష్ట్యా.. పూర్తి స్థాయిలో నిండేదాకా వేచిచూడకుండా అధికారులు గేట్లెత్తి సాగర్కు నీరు విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటనకు వెళుతున్నారు.
సీఎంతో పాటు జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, ఉమ్మడి కర్నూలు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర అధికారులు హాజరవుతారు. సీఎం పర్యటన సందర్బంగా కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, నంద్యాల ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. సున్నిపెంట, శ్రీశైలం, డ్యాం పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.