మందుబాబులకు మరీ పెద్ద కష్టమొచ్చిందే. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మందుబాబులకు ఈ బిగ్ అలెర్ట్. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటిలా మారింది. మరి ఇంతకీ ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందామా..
దేశవ్యాప్తంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, హత్యలు, అత్యాచారాలకు, ఇతర క్రైమ్స్కు మద్యపానం ప్రధాన కారణంగా మారింది. మద్యం తాగడం వల్ల వ్యక్తిగతంగా మాత్రమే కాదు.. కుటుంబాలు కూడా నాశనం అవుతున్నాయి. ప్రత్యేకంగా తెలంగాణలో లిక్కర్ వినియోగం రోజురోజుకూ పెరుగుతుండటంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. మద్యం మత్తులో వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలు బలిగొంటున్న ఘటనలు ఆందోళనకరంగా మారాయి. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై నగరంలో ఎప్పుడైనా, ఎక్కడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ నిర్వహించనున్నట్టు అధికారులు హెచ్చరించారు. బ్రీత్ ఎనలైజర్ టెస్టులో 30 మిల్లీగ్రాములు(mg/100ml) కంటే ఎక్కువ మద్యం ఉన్నట్టు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రామదాసు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాఫిక్ సీపీ సీవీ ఆనంద్, జాయింట్ సీపీ జోయల్ డేవిస్ ఆదేశాల మేరకు ఇటీవల మెగా డ్రైవ్ నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఇక రాత్రిపూటకే పరిమితం కావని.. ఎప్పుడైనా జరగొచ్చని స్పష్టం చేశారు.
2024లో దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల వల్ల దాదాపు 1.8 లక్షల మంది మరణించగా.. వీరిలో 40 శాతం మందు మత్తులో వాహనం నడిపినవాళ్లే అని పోలీసులు వెల్లడించారు. గత ఏడాది 13,000 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మద్యం సేవించి వరుసగా డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. యువత తమ భవిష్యత్ నాశనం చేసుకోవద్దని.. డ్రంక్ అండ్ డ్రైవ్కు దూరంగా ఉండాలని రామదాసు సూచించారు. స్కూల్ బస్సుల డ్రైవర్లు కూడా మద్యం సేవిస్తూ వాహనాలు నడుపుతున్నట్లు సమాచారం ఉందని, వారిపైనా రెగ్యులర్ తనిఖీలు జరుగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని.. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.