తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్బా విద్యాలయాలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ గురుకులాల్లో ఇంటర్ చదివిన విద్యార్ధులకు పాఠశాల విద్యాశాఖ గుడ్న్యూస్ చెప్పింది. ఈ పాఠశాలల్లో ఇంటర్ పాసై 2025-26 విద్యా సంవత్సరానికి ఐఐటీల్లో సీటు సాధించిన వారికి ఉచితంగా ల్యాప్టాప్లు అందజేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అలాగే పది, ఇంటర్లో ప్రతి జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురి చొప్పున విద్యార్ధులకు నగదు బహుమతి అందజేయనున్నట్లు ప్రకటించింది. అలాగే క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్ధులకు కూడా బహుమతులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. వీరందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జులై 16న పంపిణీ కార్యక్రమం ఉంటుందని సమాచారం.
ఏపీ పాలిసెట్లో 56 శాతం సీట్ల భర్తీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాలిసెట్ కౌన్సెలింగ్లో 56 శాతం సీట్లు భర్తీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 255 పాలిటెక్నిక్ కాలేజీలు ఉండగా.. వీటిల్లో కన్వీనర్ కోటా కింద 79,141 సీట్లు ఉన్నాయి. వీటిల్లో ఇప్పటి వరకు 44,511 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది పాలిసెట్లో మొత్తం 1,33,359 మంది అర్హత సాధించగా, వీరిలో కౌన్సెలింగ్కు 48,241 మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించారు. వీరిలో 47,159 మంది సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. అందులో 46,084 మంది వెబ్ ఐచ్ఛికాలు నమోదు చేసుకున్నారు. క్రీడా, ఎన్సీసీ కోటా కింద 1,051 మందికి సీట్ల కేటాయింపు పెండింగ్లో పెట్టారు. శాప్, ఎన్సీసీ డైరెక్టర్ నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన జాబితా వచ్చిన తర్వాత వీరందరికీ సీట్ల కేటాయింపు ఉంటుంది.
ఏపీ ఐసెట్ 2025 కౌన్సెలింగ్ ప్రారంభం
ఏపీలోని ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్కు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు జులై 10 నుంచి ప్రారంభమైనాయి. జులై 10 నుంచి 14 తేదీల మధ్య రిజిస్ట్రేషన్లు ఉంటాయి. జులై 11 నుంచి15వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన, జులై 13 నుంచి 16 వరకు వెబ్ ఐచ్ఛికాల నమోదు అవకాశం కల్పించారు. జులై 19న సీట్ల కేటాయింపు ఉంటుంది.