మీ ఇంట్లో ఆత్మలున్నాయి.. మీ చంటి పిల్లలకు ఆ ఆత్మలు కనిపిస్తుంటాయి. ఈ ఒక్క తాయిత్తుకట్టించుకున్నారో అంతా సెట్ రైట్.. కోడి గుడ్డుతో ఓం భీం క్లీం అన్నానంటే చాలు ఇక మీ పిల్లాడు ఎగిరి గంతేయాల్సిందే. అవును సరిగ్గా ఇదే చెప్తున్నాడు ఓ నాటు వైద్యుడు. మాయలు మంత్రాలంటూ చంటి పిల్లలకు బాగు చేస్తానంటూ చెప్పుకొస్తున్నాడు. ఒక్క కోడి గుడ్డు ఒకే ఒక్క గోడు గుడ్డు చాలు మీ చంటి పిల్లల అనారోగ్యం మటుమాయం అయిపోతుందంటూ నమ్మిస్తున్నాడు. ఆ మాయల మాటలు నమ్మిన చంటి పిల్లల తల్లులు అక్కడికి వందలాదిగా క్యూ కడుతున్నారు. డిజిటిల్ యుగంలోను ఇంకా మూడనమ్మకాలను గుడ్డిగా నమ్మేస్తూ సాగుతున్న కోడు గుడ్డు వైద్యం కథేంటో తెలుసుకోవాలంటే నిర్మల్ జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిందే..
నిర్మల్ జిల్లా గండిరామన్న ప్రాంతం.. పక్కనే సాయిబాబా దేవాలయం చంటి పిల్లల ఏడుపులతో ఆ ప్రాంతం అంతా గోలగోలగా ఉంది. బజ్జో బంగారు తల్లి.. ఊకో ఊకో నాన్న ఆ తాత చేయి పడితే చాలు నీకంతా మంచే జరుగుతుందంటూ పిల్లలను జోల పాడుతూ క్యూ లైన్ లో ఎదురు చూస్తున్నారు. అనారోగ్యంతో కొందరు ఆందోళనతో మరి కొందరు అక్కడ చంటి పిల్లలకు వైద్యం చేయించేందుకు ఎదురు చూస్తున్నారు. అలా అని అదేదో హెల్త్ క్యాంపా అంటే అస్సలు కానే కాదు.. పోనీ అక్కడ పిల్లల డాక్టర్ ఏమైనా క్లినిక్ నడిపిస్తున్నాడా అంటే అది కూడా కాదు. కానీ ఓ మూడనమ్మకం వారందరి ఇదిగో ఇలా క్యూ కట్టేలా చేసింది. చేతిలో ఒక కోడిగుడ్డు.. మంత్రించిన తాయత్తు.. మీకు ఇప్పటికే సీన్ అర్థమై ఉంటుంది అక్కడేం జరుగుతుందో. ఆత్మలు ప్రేతాత్మలంటూ మాయ చేస్తున్నాడు ఓ నాటు వైద్యుడు. కోడిగుడ్డుతో పిల్లాడి మీద ఒక్క తిప్పు తిప్పానా గాలి దూలి అంతా మటాష్ అని చెప్పుకొస్తున్నాడు. పుట్టిన మూడు రోజుల పసి కందు నుండి 12 ఏళ్ల పిల్లల వరకు అందరికి ఇదే వైద్యం చేస్తున్నానంటున్నాడు ఈ నాటు వైద్యుడు.
నాటు వైద్యుడి పేరు రవి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గండి రామన్నసాయిబాబా ఆలయం సమీపంలో ఓ రేకుల షెడ్డు వేసుకుని.. అందులోనే ఈ దుకాణం నిర్వహిస్తున్నాడు. కోడి గుడ్డు తిప్పి వేస్తే భూత ప్రేత పిశాచల నుంచి, ఆత్మల నుంచి రక్షణ దొరుకుతుందని.. ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని చెప్తున్నాడు. ఈ వైద్యం సాంప్రదాయమని.. తాతల కాలం నుండి చేస్తున్నానంటూ చెప్పుకొస్తున్నాడు. మంత్రించిన తాయత్తును మెడలో కట్టి.. ఓ వెండి కడెం చేతికి తొడిగి ఓ కోడి గుడ్డును చూ మంతర్ కాళి అని తిప్పేస్తే చాలని సెలవిస్తున్నాడు. ఈయన మాటలు నమ్మిన చంటి పిల్లల తల్లులు గుడ్డిగా నమ్మేస్తూ చంటి పిల్లలకు ఎలాంటి అనారోగ్యం ఉందోకూడా తెలుసుకోకుండా తాయత్తులతోనే నయం అయిపోతుందని నమ్మించేస్తున్నారు. ఈ మాయల మరాఠీ మాటలు నమ్మి అమాయక ప్రజలు మోసపోతున్నారు.
కోడి గుడ్డు బాబా చెప్పిన మాటలే కాదు.. అక్కడికి మూడ నమ్మకంతో వస్తువున్న కుటుంబ సభ్యుల మాటలు పిల్లల తల్లిదండ్రుల మాటలు కూడా అంతే విచిత్రంగా కనిపిస్తున్నాయి. వేలకు వేలు పెట్టి ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ చేయించే కంటే ఇక్కడి వస్తే వంద రూపాయల్లోనే నయం అయిపోతుందని చెప్తున్నారు. కోడి గుడ్డు తిప్పి చేతికి కడెం వేస్తే చాలు జ్వరం , దగ్గు , జలుబు, పక్షవాతం అన్ని పోతాయని చెప్తున్నారు. కోడిగుడ్డుతో దిష్టి తీయడం అనేది ఒక సాంప్రదాయ పద్ధతని… ప్రతికూల శక్తిని కోడి గుడ్డు గ్రహిస్తుందని.. ఆ గుడ్డును పాతిపెడితే మా పిల్లలకు ఎలాంటి కీడు జరగదని ఈ రవి బాబాను గుడ్డిగా నమ్మేస్తున్న భక్తులు చెపుతున్నారు. అలా కోడిగుడ్డు వైద్యం చేయించుకున్న పిల్లలను చావుల వద్దకు స్మశానాల వద్దకు తీసుకెళ్ల వద్దని సూచిస్తున్నాడు ఈ నాటు వైద్యుడు.