కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రేగుల హైస్కూల్లో గురువారం తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా విద్యార్థినులకు వడదెబ్బ తగిలింది . తరగతిలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఎనిమిది మంది విద్యార్థినులు వడదెబ్బకు గురై అస్వస్థతకు లోనయ్యారు. గుండె నొప్పి, చెమటలు, తల తిరగడం వంటి లక్షణాలతో డీహైడ్రేషన్తో కళ్లు తిరిగి పడిపోయారు.
పరిస్థితిని గమనించిన టీచర్లు వెంటనే స్పందించి విద్యార్థినులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరికి జగ్గంపేట ప్రభుత్వాస్పత్రిలో, మిగిలిన ఆరుగురికి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి వారంతా ప్రమాదమునుంచి బయటపడినట్లు సమాచారం. ఈ ఘటన అనంతరం ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాల యాజమాన్యం తాత్కాలికంగా సెలవు ప్రకటించింది. విద్యార్థులను స్వగృహాలకు పంపిస్తూ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. తీవ్రమైన ఎండలు, అధిక తాపనంలో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు సరైన హైడ్రేషన్ పాటించాలన.. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. వర్షాలు కురవాల్సిన సమయంలో మండు వేసవిని తలపించేలా భగభగమండిపోతున్నా భానుడు. భానుడి సెగలు.. వేడిగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ప్రజలు. ఎండల తీవ్రతకు మధ్యాహ్నం పూట రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి.