తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోగస్ పింఛన్లపై ఫోకస్ పెట్టింది. వృద్ధులు, అర్హులైన లబ్దిదారులకు మాత్రమే పింఛన్లు అందేలా చూసేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇకపై పింఛన్ పొందే ప్రతి ఒక్కరికి ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 29నుంచి రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ దారుల ఫేస్ రికగ్నిషన్ నమోదు ప్రక్రియ మొదలుకానుంది. ఇందుకోసం సెర్చ్ సంస్థ, డీఆర్డీవోలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. బ్రాంచ్ పోస్టుమాస్టర్లకు అవసరమైన స్మార్ట్ ఫోన్లు, బయోమెట్రిక్ పరికరాలు పంపిణీ చేయాలని సూచించగా, ఇవి అందుబాటులో లేకపోతే వారి స్వంత ఫోన్ల ద్వారానే యాప్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ పద్ధతి పూర్తిగా అమలులోకి వచ్చిన తర్వాత అన్ని పోస్టాఫీసుల్లో ‘చేయూత’ లబ్దిదారుల వివరాలను బోర్డుపై ప్రదర్శించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దీని ద్వారా మృతుల పేర్లపై పింఛన్లు పొందే దుస్థితిని అరికట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 42.96 లక్షల మందికి పింఛన్లు
ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 42.67 లక్షల మంది పింఛన్ పొందుతున్నారు. వీరి కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.14,628.91 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ప్రతినెలా సుమారు రూ.1000 కోట్లకు పైగా ఖర్చవుతోంది. పింఛన్ల పంపిణీలో 53 శాతం (22.72 లక్షలు) పోస్టల్ శాఖ ద్వారా బయోమెట్రిక్ ద్వారా, మిగతా 47 శాతం (19.95 లక్షలు) బ్యాంకుల ద్వారా అందిస్తున్నారు.
వేలిముద్రలతో ఇబ్బందులు – ఫేస్ రికగ్నిషన్ పరిష్కారం?
వృద్ధుల వేలిముద్రలు సరిగ్గా పడకపోవడం వల్ల ప్రతినెలా చాలా మంది పింఛన్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కొత్తగా తీసుకువచ్చిన ఫేస్ రికగ్నిషన్ విధానం వల్ల ఈ సమస్యలన్నీ తగ్గే అవకాశం ఉంది. ఒక్కోసారి మరణించిన లబ్దిదారుల పేర్లను తొలగించకపోవడం వల్ల కూడా సమస్యలు ఏర్పడుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది.
లబ్దిదారుల విభజన ఇలా
- వృద్ధాప్య పింఛన్లు – 15.25 లక్షలు
- వితంతువులు – 15.26 లక్షలు
- దివ్యాంగులు – 4.92 లక్షలు
- గీత కార్మికులు – 63 వేల మంది
- చేనేత కార్మికులు – 36 వేల మంది
- హెచ్ఐవీ బాధితులు – 35 వేల మంది
- డయాలసిస్ రోగులు – 8 వేల మంది
- ఫైలేరియా బాధితులు – 18 వేల మంది
- బీడీ కార్మికులు – 4.23 లక్షలు
- ఒంటరి మహిళలు – 1.41 లక్షలు
- బీడీ టేకేదార్లు – 4 వేల మంది
సామాజిక కేటగిరీలకు ఈ విధంగా…
- బీసీలు – 23.39 లక్షలు
- ఎస్సీలు – 6.76 లక్షలు
- ఎస్టీలు – 3.47 లక్షలు
- మైనార్టీలు – 2.84 లక్షలు
- ఓసీలు – 6.21 లక్షలు
మహిళల సంఖ్య 28.05 లక్షలు కాగా, కొత్తగా దాఖలైన దరఖాస్తులు 24.84 లక్షలు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం అనుమతి ఇస్తే లబ్దిదారుల మొత్తం సంఖ్య 69 లక్షలకు చేరవచ్చని అంచనా.