మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వ్యవస్థను అప్డేట్ చేయడంలో తెలుగు రాష్ట్రాల పోలీసులు ఎప్పుడూ ముందే ఉంటారు. సమాజంలోకి ఏ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి దాన్ని వినియోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఇలానే ఒక కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఏలూరు జిల్లా పోలీసులు 24 కేసుల్లో నిందితుడిగా ఉన్న పాత నేరస్థుడిని పట్టుకున్నారు.
జిల్లాకు చెందిన పాత నేరస్థులను పట్టుకునేందుకు ఏలూరు జిల్లా పోలీసులు ఒక కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. నేరస్థులను గుర్తించేందుకు నగరంలో పలు ప్రాంతాల్లో ఫేస్రికగ్నిషన్ ఫీచర్ కలిగిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరా కంటపడిన పాత నేరస్థులు ఇట్టే పోలీసులకు దొరికి పోతున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన కెమెరాలకు పాత నేరస్థుల ఫోటోలతో పాటు డేటాను యాడ్ చేసి ఉండడంతో.. నిందితులు ఆ కెమెరా ముందుకు వచ్చినప్పుడు పేస్రికగ్నిస్ ద్వారా వాళ్లను గుర్తుపట్టి ఆ కెమెరాలు వెంటనే పోలీసు కమాండ్ కంట్రోల్ రూంకు సమాచారం అందిస్తుంది. దీంతో, పోలీసులు అప్రమత్తమై ఆ ప్రదేశానికి వెళ్లి పాత నేరస్థులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇలానే 24 కేసుల్లో నిందితుడిగా ఉన్న కాకినాడ జిల్లాకు చెందిన పల్లి లక్ష్మణ్కుమార్ అనే పాత నేరస్థుడు పోలీసులకు పట్టుబడ్డాడు.
కాకినాడ జిల్లాకు చెందిన పల్లి లక్ష్మణ్కుమార్పై ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఇంటి దొంగతనాలు, ఇతర దొంగతనాలు కలిసి మొత్తం 24 పైగా కేసులు ఉన్నాయి. అయితే జిల్లాలో తనపై కేసులు పెరిగిపోవడంతో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు లక్ష్మన్ ఏలూరు జిల్లాకు షిఫ్ట్ అయ్యాడు. గత కొన్ని రోజులుగూ అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో లక్ష్మణ్ ఒక రోజు పని నిమిత్తం ఏలూరు రైల్వే స్టేషన్కు పరిసరాల్లోకి వెళ్లాడు. అక్కడ ఉన్న కెమెరాలు లక్ష్మణ్ను గుర్తించి వెంటనే ఏలూరు కమాండ్ కంట్రోల్రూంకు సమాచారం అందించాయి. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి ఒక కానిస్టేబుల్ను పంపించారు. అయితే లక్ష్మణ్ అక్కడ కనిపించలేదు.. దీంతో తమ దగ్గర ఉన్న ఫోన్ నెంబర్తో లక్ష్మణ్కు ఫోన్ చేసి అడగ్గా అతను మొదట పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినా.. తర్వాత ఏలూరు ఉన్నట్టు తెలిపాడు. దీంతో ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.