సినీ పరిశ్రమకు పూర్తిగా సహకారం అందిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.. కానీ పరిశ్రమను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. ఎవరైనా చట్ట పరిధిలో పనిచేయాల్సిందేనని తనను కలిసిన నిర్మాతలు, దర్శకులకు స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో పని వాతావరణం బాగుండాలని.. కార్మికుల పట్ల నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని సీఎం సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు పలువురు టాలీవుడ్ నిర్మాతలు. ఇటీవల జరిగిన టాలీవుడ్ సమ్మె కారణంగా చిత్ర పరిశ్రమలో అనేక సమస్యలు తలెత్తాయి. సినిమా షూటింగ్లు ఆగిపోవడంతో పాటు, సినిమాల విడుదలలు కూడా వాయిదా పడ్డాయి. ఈ పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని, సమ్మె విరమించేందుకు చర్యలు తీసుకోవడం వల్ల పరిశ్రమకు భారీ ఊరట లభించింది. ఈ పరిణామాల నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు పూర్తిగా సహకారం అందిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.. కానీ పరిశ్రమను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. ఎవరైనా చట్ట పరిధిలో పనిచేయాల్సిందేనని తనను కలిసిన నిర్మాతలు, దర్శకులకు స్పష్టం చేశారు.
సినీ పరిశ్రమలో పని వాతావరణం బాగుండాలని.. కార్మికుల పట్ల నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని సీఎం సూచించారు. పరిశ్రమలోకి కొత్తగా వచ్చే వారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకోసం ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. స్కిల్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తామన్నారు. పరిశ్రమలో నిర్మాతలు, కార్మికుల అంశంలో సంస్కరణలు అవసరమని చెప్పారు. నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి పాలసీ తీసుకువస్తే బాగుంటుందని చెప్పారు. పరిశ్రమ విషయంలో తాను న్యూట్రల్గా ఉంటాని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను ఉంచడమే తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.