జేఎన్టీయూ హైదారబాద్ పరిధిలోని అన్ని కాలేజీల్లో ఫార్మా డి మొదటి ఏడాది పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు పరీక్షలు వాయిదా వేసినట్లు జేఎన్టీయూ పరీక్షల విభాగం డైరెక్టర్ డాక్టర్ కె కృష్ణమోహన్రావు ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబరు 6న జరగాల్సిన పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు తన ప్రకటనలో వెల్లడించారు. ఆ రోజు గణేశ్ నిమజ్జనం ఉండటంతో ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 6వ తేదీన జరగాల్సిన పరీక్షను సెప్టెంబరు 17వ తేదీకి మార్చినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు జేఎన్టీయూ యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో ఉన్నట్లు ఆయన వివరించారు. ఈ మేరకు విద్యార్ధులు గమనించాలని, సూచనల ప్రకారం పరీక్షలకు సిద్ధమవ్వాలని తెలిపారు.
ఎస్ఎస్సీ హిందీ ట్రాన్స్లేటర్ ప్రాథమిక కీ వచ్చేసింది.. సెప్టెంబర్ 7 వరకు అభ్యంతరాలకు ఛాన్స్!
ఎస్సెస్సీ కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్ 2025 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్తో లాగిన్ అయి ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీతోపాటు రెస్పాన్స్షీట్, ప్రశ్నపత్రంని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీపై అభ్యంతరాలను తెలిపేందుకు సెప్టెంబర్ 7 వరకు అవకాశం ఇచ్చింది. కాగా ఎస్ఎస్సీ హిందీ ట్రాన్స్లేటర్ పేపర్ 1 పరీక్ష ఆగస్టు 12న జరిగిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కింద వివిధ ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలలో ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. మరోవైపు సీజీఎల్ 437 గ్రూప్ ‘బి’ నాన్ గేజిటెడ్ పోస్టులకు కూడా స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలింసిందే. ఈ పోస్టులకు నిర్వహించవల్సిన రాత పరీక్ష మరో వారంలోనే జరగనుంది.