హైదరాబాద్ స్టార్టప్ వియోనా ఫిన్టెక్కి NPCI ఆమోదం లభించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, చిన్న వ్యాపారులు UPI ద్వారా డిజిటల్ చెల్లింపులు ఈజీగా చేయవచ్చు. వియోనా రూపొందించిన గ్రామ్పే ప్లాట్ఫారమ్ రైతులను నేరుగా కొనుగోలుదారులతో కలిపి పారదర్శక ధరలు, వేగవంతమైన చెల్లింపులను అందించనుంది.
హైదరాబాద్కి చెందిన వియోనా ఫిన్టెక్ అనే స్టార్టప్ పెద్ద ముందడుగు వేసింది. ఈ సంస్థ గ్రామ్పే, వియోనా పే యాప్లను రూపొందించింది. తాజాగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నుంచి థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ (TPAP)గా పనిచేయడానికి ఆమోదం పొందింది. దీంతో ఇకపై వియోనా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవలను బ్యాంకులతో కలిసి అందించనుంది. ముఖ్యంగా టైర్ II, టైర్ III పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపులు మరింత సులభం కానున్నాయి.
ఈ ప్లాట్ఫారమ్ రైతులు, చిన్న వ్యాపారులు, గ్రామీణ ప్రజలకు డబ్బు పంపించడం, వసూలు చేయడం, కొనుగోలు-అమ్మకాలు సులభంగా చేసేలా సహాయం చేస్తుందని వియోనా ఫౌండర్ రవీంద్రనాథ్ యార్లగడ్డ చెప్పారు.
గ్రామ్పే ప్లాట్ఫారమ్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రైతులు, గ్రామీణ వ్యాపారులు UPI ద్వారా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ-కామర్స్ను ప్రోత్సాహం లభిస్తుంది. VLEలు (గ్రామ స్థాయి ప్రతినిధులు) ద్వారా డిజిటల్ లావాదేవీలపై అవగాహన పెరుగుతుంది. రైతుల కోసం కొత్త మార్కెట్ప్లేస్గా ఉపయోగపడుతుంది. రైతులు తమ పంటను నేరుగా కొనుగోలుదారులకు అమ్ముకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. ధరల పారదర్శకత పెరిగి, రైతులకు వెంటనే చెల్లింపులు అందుతాయి. గ్రామీణ వ్యాపార లావాదేవీల్లో UPI పరిధి మరింత పెరుగుతుంది.
వియోనా ప్లాట్ఫారమ్ పేఇన్, పేఔట్, వర్చువల్ అకౌంట్స్, UPI స్విచింగ్ వంటి అనేక సేవలు అందిస్తుంది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డబ్బు పంపడం, తీసుకోవడం, రికార్డులు సేఫ్గా, సులభంగా, వేగంగా పూర్తవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపులు విస్తరించి, రైతులు, చిన్న వ్యాపారులకు సులభంగా చేరువ అవుతాయి. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలపరచనుంది.