తెలంగాణ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్కి శ్రీకారం చుట్టిందా.. గతంలో పార్టీని వీడిన వారిని తిరిగి పార్టీలోకి వెల్కమ్ పలుకుతారా?.. పార్టీ వీడిన వారిలో సీనియర్లు ఎవరున్నారు. పాత వాళ్లని మళ్లీ వెనక్కి పిలవడం వల్ల కాంగ్రెస్కు ఏం లాభం.. అసలు సడెన్గా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? అనేది ఈ కథనంలో తెలుసుకోండి..
గత అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీని వీడి బీఆర్ఎస్, బీజేపీలో చేరిన నేతలకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పలుకుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ దక్కకపోవడం, ఇతర నేతలతో విభేదాల కారణంగా కొందరు కాంగ్రెస్ ముఖ్య నేతలు పార్టీని వీడాల్సి వచ్చింది. ఇప్పుడు వారందరినీ తిరిగి పార్టీలోకి తీసుకోవాలని డిసైడ్ అయ్యారు పెద్దలు. ఈ మేరకు టి.పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో భట్టి ప్రతిపాదన పెట్టగా కార్యవర్గం అంతా ఏకగ్రీవంగా ఆమోదం కూడా తెలిపింది. కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల తరబడి పనిచేసి ఐడియాలజీ ఉన్న నేతలను చేర్చుకుంటే పార్టీ మరింత బలోపేతం అవుతుందని పీసీసీ భావిస్తోంది. దీంతో మళ్లీ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చే పాత నేతలెవరనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్రెడ్డి పార్టీని వీడారు. అంతేకాకుండా మూల విక్రమ్గౌడ్తో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయిలో పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ నేతలంతా బీఆర్ఎస్, బీజేపీల్లో కొనసాగుతున్నారు. ఇప్పుడు వీరందరినీ తిరిగి పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం అవుతుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగానే టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికలకు ముందు పార్టీని వీడిన వారిని పార్టీలో చేర్చుకోవడంపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేసింది. దీనిపై ఎవరిని పార్టీలోకి తీసుకోవాలి, ఎవరిని తీసుకోవద్దనే దానిపై ముందుగానే అంచనాకు వచ్చింది పీసీసీ. గాంధీభవన్లో జరిగిన టీ పీసీసీ విస్తృత స్థాయి మీటింగ్లో కూడా పార్టీ వీడిన నేతలను తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతిపాదన తీసుకొచ్చారు. డిప్యూటీ సీఎం చేసిన ప్రతిపాదనకు పీసీసీ కార్యవర్గమంతా ఆమోదం తెలిపింది. దీంతో కాంగ్రెస్ పాత నేతలకు గాంధీ భవన్ గేట్లు తెరుచుకోబోతున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయింది. అంతేకాకుండా త్వరలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు సైతం నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. దీంతో సంస్థాగతంగా కాంగ్రెస్ మరింత బలోపేతం కావాలంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీల్లో చేరిన వారికి కాంగ్రెస్ కండువా కప్పాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
భట్టి విక్రమార్క చేసిన ప్రతిపాదనతో త్వరలోనే సీనియర్లు తిరిగి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. ఎంత మంది మళ్లీ సొంత గూటికి చేరుతారో, పార్టీ మళ్లీ వారికి ఎలాంటి స్థానం కల్పిస్తుందో వేచి చూడాలి.