తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల ఫలితాలను రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. జవాబు పత్రాలను పునర్ మూల్యాంకనం చేయించాలని, లేదంటే పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును డివిజన్ బెంచ్లో అప్పీలు చేయాలని టీజీపీఎస్సీ భావిస్తుంది. కోర్టు ఆదేశాల మేరకు రీవాల్యూయేషన్ చేస్తే సాంకేతిక సమస్యలు రావొచ్చని టీజీపీఎస్సీ అభిప్రాయపడుతుంది.
గ్రూప్ 1 పరీక్షల్లో ప్రిలిమ్స్కు, మెయిన్స్కు వేర్వేరు హాల్టికెట్లు జారీ చేశారు. దీంతో కేంద్రాల కేటాయింపులో పారదర్శకత లేదని సింగిల్ జడ్జి తీర్పు సమయంలో తప్పుబట్టింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను, సమగ్రతను కొనసాగించలేదని, పక్షపాతంతో వ్యవహరించినట్లు కనిపిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. నోటిఫికేషన్లో ఇచ్చిన నియమ, నిబంధనలను సైతం ఉల్లంఘించినట్లు పేర్కొంది. పరీక్షలు రాసిన వారి సంఖ్యపై కూడా కమిషన్కు కనీస అవగాహన లేదని తప్పుబట్టింది. మూల్యాంకనం కోసం చేసిన ప్రొఫెసర్ల ఎంపికలోనూ పారదర్శకత పాటించలేదని, ఫలితంగా తెలుగు మాధ్యమ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగినట్లు కోర్టు పేర్కొంది. అయితే గ్రూప్-1 తీర్పుపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్లో అప్పీలు చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. దీంతో టీజీపీఎస్సీ గురువారం జరిగిన టీజీపీఎస్సీ ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఏపీపీఎస్సీ ఏఈఈ మెరిట్ 2025 జాబితా విడుదల
ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్లో ఏఈఈ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన మెరిట్ జాబితాను ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాను అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. పరీక్ష రాసిన అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ నుంచి మెరిట్ లిస్ట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా 2023లో 21 ఏఈఈ పోస్టుల భర్తీకి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకటన వెలువరించగా.. ఇన్నాళ్లకు ఫలితాలను వెల్లడించింది.