మెగా డీఎస్సీ -2025 తుది జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. 16,347 పోస్ట్లకు గాను రెండు విడతలుగా పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.. మెగా డీఎస్సీ పరీక్షల అనంతరం.. జూలై 5న ప్రాథమిక కీ విడుదల చేసిన ప్రభుత్వం.. ఆగస్టు 1న ఫైనల్ కీ విడుదల చేసింది.. అనంతరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ను పూర్తి చేసింది.. మొత్తం ప్రక్రియ అనంతరం డీఎస్సీ తుది ఎంపిక జాబితాను (సెప్టెంబర్ 15) ప్రభుత్వం విడుదల చేసింది. డీఎస్పీ అధికారిక వెబ్సైట్లో https://apdsc.apcfss.in/ తుది ఎంపిక జాబితాను విడుదల చేసింది.. 16,347 పోస్ట్ లకు ఎంపిక ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెగా డీఎస్సీ వాగ్దానం నెరవేరిందని పేర్కొన్నారు. ఈ మైలురాయి బాధ్యతను మరింత పెంచిందన్నారు. హామీ ఇచ్చినట్టుగా ప్రతిఏటా డీఎస్సీ నిర్వహిస్తామని.. ఈసారి రాలేకపోయినవారు నిరుత్సాహపడొద్దని లోకేశ్ సూచించారు.
మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితా.. జిల్లా విద్యాశాఖాధికారి, కలెక్టర్ కార్యాలయాలలో, అలాగే మెగా డీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఉంటుందని అధికారులు తెలిపారు.
పాఠశాల విద్యా శాఖ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఏప్రిల్ 20, 2025న జారీ అయింది. ప్రభుత్వ, పంచాయతీ రాజ్, మున్సిపల్ పాఠశాలలతో పాటు గిరిజన, సామాజిక, బీసీ, బాలల సంక్షేమం, మోడల్, రెసిడెన్షియల్, ప్రత్యేక పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం కోసం.. నోటిఫికేషన్ ను విడుదల చేశారు. మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులను సమర్పించారు. సీబీటీ పరీక్షలు జూన్ 6 నుండి జూలై 2 వరకు ప్రతిరోజూ రెండు షిఫ్టులలో నిర్వహించారు. ప్రిలిమినరీ కీని జూలై 5న, ఫైనల్ కీని ఆగస్టు 1న విడుదల చేశామని.. టెట్ స్కోర్లకు 20 శాతం వెయిటేజీ ఇచ్చామని డీఎస్సీ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి చెప్పారు. అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఏడు దశల్లో పూర్తయిందని వెల్లడించారు.