తమిళనాడులో మరోసారి శపథ రాజకీయాలు మొదలయ్యాయి. ఈసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శపథం చేశారు. DMKను పదవి నుంచి దించే వరకు చెప్పులు వేసుకోనని ప్రకటించారు. DMK ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ తనకు తాను కొరడా దెబ్బలు కొట్టుకున్నారు. అన్నా యూనివర్శిటీ క్యాంపస్లో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనకు నిరసనగా ఆయన ఆందోళన చేపట్టారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి….
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వినూత్న నిరసన తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆరు కొరడా దెబ్బలు కొట్టుకుని నిరసన తెలిపారు అన్నామలై. అంతేకాదు DMK సర్కార్ను దించేవరకు చెప్పులు వేసుకోనని ప్రతిజ్ఞ చేశారు.
తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయనే చెప్పాలి. డీఎంకేను అధికారం నుంచి దించే వరకు తాను పాదరక్షలు వేసుకోబోనని బీజేపీ చీఫ్ అన్నామలై ప్రకటించారు. అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదంటూ.. ఇకపై తాను రెగ్యులర్ రాజకీయాలు చేయబోనని అన్నారు. అన్నా యూనివర్శిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనపై అన్నామలై ప్రెస్మీట్ పెట్టారు. 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి వివరాలు ఉన్న ఎఫ్ఐఆర్ లీక్ అవ్వడంపై కూడా ఆయన ఘాటుగా స్పందించారు. రాష్ట్ర పోలీసులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. బాధితురాలే భయపడేలా పోలీసులు ఎఫ్ఐఆర్ రాయడాన్ని ఖండించారు. డీఎంకే ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. అన్నా యూనివర్శిటీ లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన జ్ఞానశేఖరన్ గతంలో కూడా నేరాలు చేశాడని అన్నామలై ఆరోపించారు. డీఎంకే నేతలతో ఉన్న కారణంగా పోలీసుల ఆయనపై రౌడీ షీట్ తెరవలేదని విమర్శించారు. డీఎంకే ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ ఇవాళ తనకు తాను కొరడా దెబ్బలు కొట్టుకున్నారు. డీఎంకేను గద్దె దించేందుకు ఇవాళ్టి నుంచి 48 రోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తున్నారు.