ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC).. డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (డీపీఆర్ఓ) పోస్టులకు సంబంధించి కీలక అప్ డేట్ జారీ చేసింది. ఈ పోస్టులకు ఇప్పటికే రాత పరీక్ష పూర్తి కాగా మెరిట్ లిస్ట్ కూడా వెల్లడించింది. ఈ పోస్టలకు ఎంపికైన అభ్యర్ధులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించే తేదీని ఏపీపీఎస్సీ తాజాగా ప్రకటించింది..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (డీపీఆర్ఓ) పోస్టులకు సంబంధించి ఇప్పటికే రాత పరీక్ష పూర్తైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన మెరిట్ లిస్ట్ విడుదల చేయగా… అందులోని అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన జనవరి 30న నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తాజాగా ఓ ప్రటకనలో వెల్లడించింది. జవనరి 30వ తేదీన ఉదయం 10:30 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించింది. కమిషన్ వెబ్సైట్ నుంచి మెమో, చెక్ లిస్టులు, ఎటెస్టేషన్ ఫామ్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. కాగా ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ.35,120 నుంచి రూ.87,130 వేతనంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.
ఫిబ్రవరి 17 నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీఫార్మసీ పరీక్షలు
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని బీఫార్మసీ కాలేజీల్లో ఫిబ్రవరి 17వ తేదీ నుంచి నిర్వహించే పరీక్షల షెడ్యూల్ తాజాగా విడుదలైంది. నాలుగో ఏడాదిలో ఏడో సెమిస్టర్, మూడో ఏడాదిలో ఐదో సెమిస్టర్, ఆరో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు సీఈ శివప్రసాదరావు పేర్కొన్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఫిబ్రవరి 3వ తేదీ లోపు పరీక్షల ఫీజులు చెల్లించాలని సీఈ తెలిపారు. రూ.100 అపరాధ రుసుంతో ఫిబ్రవరి 4వ తేదీలోపు చెల్లించవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలను ఏఎన్యూ వెబ్సైట్లో ఉంచామని సీఈ వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పాలిసెట్పై అవగాహన కార్యక్రమాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్పై ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు అవగాహన కల్పించేందుకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. పాలిసెట్ రాసే విద్యార్థుల సంఖ్య పెంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా సాంకేతిక విద్యాశాఖ పాలిసెట్పై ప్రచారం నిర్వహిస్తోంది.