2019లో రామ్గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో ఓ సినిమా తీశారు. ఆ మూవీపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేయడంతో ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అనే పేరుతో సినిమాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను యూట్యూబ్లో మాత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరిట విడుదల చేశారని గుంటూరు జిల్లాకు మంగళగిరి సమీపంలోని ఆత్మకూర్కు చెందిన వంశీకృష్ణ బండారు సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన వ్యాఖ్యలతో ఎప్పుడు సంచలనం సృష్టించే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పోలీసులు ముందుకు వచ్చేనా అని అందరూ చర్చించుకుంటున్నారు. వ్యూహం సినిమా సమయంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్స్పై అనేక మంది రామ్ గోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఆర్జీవీని రెండు రోజుల క్రితం పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. అదే సమయంలో గుంటూరు సీఐడీ పోలీసులు ఆర్జీవీకి నోటీస్ అందిచడం కలకలం రేపింది. ఈ నెల పదో తేదిన గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీస్లో పేర్కొనటం జరిగింది.
ఇంతకీ ఏ కేసులో విచారణకు హజరు కావాలన్నారంటే…
గత ప్రభుత్వ హాయాంలోనే రామ్ గోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ప్రకటన చేశారు. ఈ ప్రకటన అప్పుడు సినీ ప్రపంచంతో పాటు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. రాష్ట్రంలోని రెండు ప్రధాన కులాలైన కమ్మ, రెడ్డి పేర్లను రాజకీయాలకు ముడిపెట్టడంతో మరింత చర్చకు దారి తీసింది. ఆ మూవీపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేయడంతో సినిమా పేరును అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అని మార్చి తీశారు. ఈ సినిమా ప్రకటన తర్వాతే వ్యూహాం రావడం అది కాకుండా వివాదాస్పదం కావడం అందరికీ తెలిసిందే.. వ్యూహం సినిమా సమయంలో సోషల్ మీడియా పోస్టింగ్స్ పైనే ఆర్జీవీ కేసులు ఎదుర్కొంటున్నారు.
ఇప్పుడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా పేరుతోనే మూవీని యూట్యూబ్లో రిలీజ్ చేసి రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టారని, కులాలను రెచ్చగొట్టేలా వీడియోలు పోస్ట్ చేశారని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిది బండారు వంశీ క్రిష్ణ గత ఏడాది నవంబర్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన సీఐడీ పోలీసులు ఇప్పుడు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. అయితే రెండు రోజుల క్రితం ప్రకాశం పోలీసులు ఎదుట విచారణకు హాజరైన సమయంలోనే ఈ నోటీస్లు తెరపైకి వచ్చాయి.
అయితే ఆర్జీవీ సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరవుతారా లేక సమయం కోరతారా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. సోమవారం ఉదయం పది గంటలకు విచారణకు గుంటూరు సీఐడీ కార్యాలయానికి రావాల్సి ఉంది. అయితే ఆయన వస్తారా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఐడీ అధికారులు మాత్రం విచారణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వర్మ విచారణకు వస్తారా రారా అన్న అంశంపై సోమవారం స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.