రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడూల్ను ఉన్నత విద్యా మండలి ఈ రోజు విడుదల చేయనుంది. ఆయా ప్రవేశ పరీక్షల కన్వీనర్లతో సమావేశం నిర్వహించిన తర్వాత ప్రవేశ పరీక్షల తేదీలు, దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్లను ప్రకటించనుంది. గతకొంత కాలంగా షెడ్యూల్ విడుదలకు తీవ్ర జాప్యం నెలకొన్న సంగతి తెలిసిందే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడూల్ను ఉన్నత విద్యా మండలి గురువారం (ఫిబ్రవరి 13) విడుదల చేయనుంది. ఈ రోజు ప్రవేశ పరీక్షల కన్వీనర్లతో సమావేశం నిర్వహించిన తర్వాత ఉన్నత విద్యకు సంబంధించిన పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు, దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్లను APSCHE ప్రకటించనుంది. దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణకు సాఫ్ట్వేర్ సంస్థను ఎంపిక చేసేందుకు ఉన్నత విద్యామండలి ఇటీవల టెండరు పిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో టీసీఎస్ ఎల్-1గా నిలవడంతో దానిని ఎంపిక చేశారు. దీంతో ఎట్టకేలకు ఈ ప్రక్రియ ముగియడంతో ఆయా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలకు ఉన్నత విద్యా మండలి చకచకా చర్యలు తీసుకుంటోంది.
మరోవైపు తెలంగాణలో ఇప్పటికే అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. పలు పరీక్షల నోటిఫికేషన్లు కూడా జారీ చేయడం జరిగింది. మే 12న తెలంగాణ ఈసెట్, జూన్ 1న ఎడ్సెట్, జూన్ 6న లాసెట్, పీజీఎల్ సెట్, జూన్ 8, 9 తేదీల్లో ఐసెట్, జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో నేడు షెడ్యూల్ విడుదలైతే అనంతరం ఆయా పరీక్షల నిర్వహణకు సంబంధించిన తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.
తెలంగాణలో తొలిసారి.. సీనియర్ ఐఏఎస్ అధికారులతో సివిల్స్ అభ్యర్థులకు మాక్ ఇంటర్వ్యూలు!
ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రాత పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. తుది దశ మౌఖిక పరీక్షలో మెరిస్తేనే కలల కొలువు దక్కుతుంది. అయితే ఈ సారి ఇంటర్వ్యూకి ఎంపికైన తెలంగాణ అభ్యర్థులకు తొలిసారి సీనియర్ ఐఏఎస్ అధికారులే నేరుగా మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా సింగరేణి భవన్లో పలువురు సీనియర్ అధికారులతో కూడిన ప్యానెల్ మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ప్యానల్ సభ్యులు వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగడంతోపాటు తుది ఇంటర్వ్యూను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై కూడా పలు సూచనలు చేశారు. మునుముందు మరిన్ని మాక్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. కాగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అభ్యర్ధులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించడంతో పాటు, మాక్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తుండటంతో రాష్ట్ర అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు.