దాదాపు ఏడాది తర్వాత గ్రూప్ 2 అభ్యర్ధులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రిలిమ్స్ తర్వాత అతీగతీ లేకుండా పోయిన మెయిన్స్ పరీక్షలను ఎట్టకేలకు నిర్వహించేందుకు కార్యచరణ రూపొందించింది. దీనిలో భాగంగా తాజాగా హాల్ టికెట్లను కూడా జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల్లో మరో రెండు వారాల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనుంది..
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సంబంధించిన కీలక అప్డేట్ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) జారీ చేసింది. త్వరలో నిర్వహించనున్న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లను ఈ రోజు (ఫిబ్రవరి 13) విడుదల చేసినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అధికారిక వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను అభ్యర్థులు ముందుగానే డౌన్లోడ్ చేసుకుని అందులోని సూచనలను పాటించాలని పేర్కొంది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జనవరి 5వ తేదీన నిర్వహించవల్సి ఉంది. కానీ అప్పట్లో మెగా డీఎస్సీ హడావిడిలో ఈ పరీక్ష నిర్వహణ సాధ్యంకాదని కమిషన్ వాయిదా వేసింది.
అయితే నాటకీయ పరిణామాల దృష్ట్యా మెగా డీఎస్సీ ప్రకటన వెలువడకపోగా మరింత ఆలస్యమైంది. ఇందుకోసం వాయిదా వేసిన గ్రూప్ పరీక్ష కూడా చాలా రోజుల వరకు వాయిదా పడింది. మరోవైపు టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాలన్నీ బిజీగా మారనున్నాయి. అందుకే ఈ పరీక్షలన్నింటికంటే ముందుగానే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని భావించిన కమిషన్.. ఆ మేరకు ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించాలని నిర్ణయించింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ఫిబ్రవరి 23న మొత్తం 13 జిల్లా కేంద్రాల్లో జరగనున్నాయి. పేపర్ 1 ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, పేపర్ 2 పరీక్ష సాయంత్రం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహించనుంది.