రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ శాసనమండలి సభ్యుల (MLC) ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 27 వరకు హైదరాబాద్లోని మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఫిబ్రవరి 25న ఉదయం 6:00 గంటల నుండి ఫిబ్రవరి 27న ఉదయం 6:00 గంటల వరకు వైన్ షాపులు బంద్ అవుతాయి..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మందు బాబులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఏకంగా 3 రోజుల వరకు మద్యం షాపులు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఫిబ్రవరి 25 నుంచి 27వ తేదీ వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని దాదాపు సగానికి పైగా జిల్లాల్లో ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో కూడా లిక్కర్ షాపులు పూర్తిగా బంద్ కానున్నాయి. ఫిబ్రవరి 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాపులు మూసి ఉండనున్నాయి. మద్యం షాపులతో పాటు కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు కూడా క్లోజ్ కానున్నట్లు పేర్కొంది.
వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ స్థానానికి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ స్థానానికి ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి కూడా అదే రోజు ఎన్నికలు జరుగుతాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఏడు జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. అలాగే రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు గ్రామాల్లో కూడా ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అలాగే యాదాద్రి జిల్లాలో కూడా ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. ఆయా గ్రామాలు ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల పరిధిలోకి రావడమే అందుకు కారణం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
కాగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పట్టభద్రుల స్థానంలో 56 మంది, టీచర్ల స్థానంలో 15 మంది పోటీలో నిలిచారు. . ఫిబ్రవరి 27న పోలింగ్ కోసం ఇప్పటికే అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పోలింగ్ అనంతరం మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఆంక్షలు విధించనున్నారు.