11వ శతాబ్దంలో ప్రస్తుత కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించిన కళ్యాణి చాళుక్య యువరాణి అక్కాదేవికి చెందిన రెండు బంగారు నాణేలు తెలంగాణ రాష్ట్రంలో లభించాయి. దీనిని అరుదైన ఆవిష్కరణగా చరిత్రకారులు చెబుతున్నారు. ఈ నాణేలు తెలంగాణలోని మాడుగుల గ్రామం సమీపంలో లభించాయి. వాటిపై కన్నడ భాషలో 11వ శతాబ్దపు అక్షరాలతో కూడిన శాసనాలు ఉన్నాయి.
కళ్యాణి చాళుక్య యువరాణి అక్కాదేవికి చెందిన రెండు బంగారు నాణేలు తెలంగాణలో తొలిసారిగా లభించాయని భారత పురావస్తు సర్వే (ASI) తెలిపింది. ఈ నాణేలు మహబూబ్ నగర్ జిల్లా మాడుగుల సమీపంలో లభించాయి. ఈ నాణేల ఆవిష్కరణకు హైదరాబాద్కు చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ దేమ రాజారెడ్డి సహకరించారని ASI వెల్లడించింది.
11వ శతాబ్దానికి చెందిన అక్షరాలతో కన్నడలో వ్రాయబడిన నాణేలపై ‘శ్రీ గుణదబెడంగి’ అని శాసనం రాసి ఉంది. దాని అర్థం సద్గుణాల అందంగా తెలుస్తోంది. అక్కాదేవి (1010-1064 CE) విక్రమాదిత్య V కుమార్తె. జయసింహ-II సోదరి. ఆమె ప్రస్తుత బీదర్, బాగల్కోట్తో పాటు బీజాపూర్ జిల్లాల్లో ఉన్న కిషుకాడు అనే ప్రాంతానికి గవర్నర్గా పరిపాలించింది. ఆమెను గుణదబెడంగి అని కూడా పిలిచేవారని ASI తెలిపింది.
దక్షిణ భారతదేశ చరిత్రలో చాళుక్యుల పాలన ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ముఖ్యంగా వారి పాలనను కర్ణాటక చరిత్రలో స్వర్ణయుగంగా చెబుతారు. భారతదేశంలోని దక్కన్ పీఠభూమిని చాళుక్యులు 600 సంవత్సరాలకు పైగా పరిపాలించారు. అక్కాదేవి పశ్చిమ చాళుక్య సామ్రాజ్యంలో భాగంగా ఉండేవారు. ఆమె చోళులతో, తన దూరపు బంధువులైన వేంగి తూర్పు చాళుక్యులతో నిరంతరం ఘర్షణ పడేవారని చరిత్రకారులు చెబుతున్నారు .
అక్కాదేవి తన పాలనలో గ్రాంట్ల ద్వారా విద్యను ప్రోత్సహించింది. జైన, హిందూ దేవాలయాలకు విరాళాలు ఇచ్చింది. 1022 నాటి ఒక శాసనంలో ఆమె యుద్ధంలో భైరవి లాంటి ధైర్యసాహసాలు ప్రదర్శించిన మహిళగా రాసి ఉంది. స్థానిక తిరుగుబాటును అణిచివేయడానికి ఆమె గోకాక్ కోటను ముట్టడించింది. బ్రాహ్మణులకు గ్రాంట్లు ఇవ్వడం ద్వారా.. ఆ సామాజిక వర్గంలో విద్యను ప్రోత్సహించిందని చెబుతారు.