నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు మోసం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి కేటుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నప్పటికీ, అమాయక నిరుద్యోగులు మోసపోతూనే ఉన్నారు. కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు నిరుద్యోగ మహిళలకు జాదూగాళ్లు కుచ్చుటోపి పెట్టారు. ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
నల్లగొండ పట్టణానికి చెందిన ఎండీ నసీర్ నల్లగొండ కోర్టులో విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులకు గుమస్తాగా పని చేస్తున్నారు. మరోవైపు పలు కేసులపై ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేసేవాడు. నల్లగొండకు చెందిన జ్యోతి రాణి జూనియర్ అడ్వకేట్గా పని చేస్తోంది. వీరిద్దరికి కోర్టులో పరిచయం ఏర్పడింది. ఈజీ మనీ కోసం ఇద్దరూ పథకం వేశారు. వివిధ రకాల సమస్యలు, కోర్టులో కేసుల నిమిత్తం వచ్చే నిరుద్యోగ, యువతీ యువకులతో మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నారు. కొంతకాలంగా కోర్టులో స్వీపర్, అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగ మహిళలకు నమ్మ బలికారు.
నల్లగొండ, తిప్పర్తి, మాడ్గులపల్లి మండలాలకు చెందిన 31మంది నిరుద్యోగుల నుంచి కొంతకాలంగా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగ మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఉద్యోగం గురించి అడిగినప్పుడల్లా రేపు మాపు అంటూ మాట దాటవేస్తున్నారు. దీంతో విసిగి పోయిన మహిళ నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. తిప్పర్తి మండలం ఇండ్లూరుకు చెందిన బాధితురాలు ఏపూరి హెప్సిబా ఈ నెల 7వ తేదీన ఫిర్యాదు చేయటంతో వారిద్దరిని అ దుపులోకి తీసుకుని విచారించగా, నేరం అంగీకరించారు.
నసీర్, జ్యోతిరాణిపై తిప్పర్తి, మాడ్గులపల్లి, నల్లగొండ వనటౌన పోలీస్ స్టేషనలో 7 కేసులు నమోదయ్యాయని, వారినుంచి రూ.10వేల నగదు, ద్విచక్ర వాహనం, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. జాబ్ ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేసే వాళ్లను నమ్మి మోస పోవద్దని అమాయకులైన నిరుద్యోగ యువతకు డీఎస్పీ సూచించారు. ప్రస్తుతం ప్రతీ ఉద్యోగానికి పత్రికా ప్రకటనతో పాటుగా రాత పరీక్ష ఉంటుందని ఆయన చెప్పారు.