హైదరాబాద్లోని ఓ వైద్యురాలు ఏఐ సాయంతో జరిగిన సైబర్ మోసానికి బలి అయ్యారు. నకిలీ వీడియోలు, లింకుల ద్వారా ఆమెను రూ.20 లక్షల రూపాయలు పోగొట్టారు. నిర్మలా సీతారామన్ గారి పేరుతో ఉన్న నకిలీ వీడియోను చూపించి నమ్మించి మోసం చేశారు.
సైబర్ మోసాలు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎంత అవగాహన కల్పించినా, కేంద్రం నుంచి ఎన్ని సూచనలు సలహాలు వచ్చినా అవేమి పట్టించుకోకుండా బాధితులు మోసపోతున్నారు. ఇన్వెస్ట్మెంట్, ఫెడెక్స్ ఫ్రాడ్ అంటూ వివిధ రకాలుగా సైబర్ నేరస్థులు ప్రజలను బురిడీ కొట్టించి కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. ఇటీవల కాలంలో ఓ సైంటిస్ట్ ఫెడెక్స్ ఫ్రాడ్లో ఏకంగా కోటి 34 లక్షల రూపాయలను పోగొట్టుకున్నారు. ఆ ఘటన మరువకముందే తాజాగా ఓ వైద్యురాలు రూ.20 లక్షలు పోగొట్టుకున్నారు.
ఏఐతో వివిధ రకాల వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఏఐ సాయంతోనే సైబర్ నేరస్థులు ఓ వైద్యురాలికి టోకరా వేశారు. హైదరాబాద్కు చెందిన ఓ వైద్యురాలి వాట్సప్కు కొన్ని నెలల క్రితం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఓ లింక్ను షేర్ చేశాడు. ఆ లింకును ఓపెన్ చేయగా.. ఆన్లైన్లో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని ఉంది. అంతేకాకుండా ఆ లింకులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాతున్న ఓ వీడియో కూడా ఉంది. అది చూసిన డాక్టరమ్మకు ఆ లింక్పై కాస్త నమ్మకం కలిగి.. అందులో పేర్కొన్న నంబర్కు కాల్ చేసి పెట్టుబడికి సంబంధించిన వివరాలను తెలుసుకుంది. ఆ తర్వాత ఆమె ఆధార్, PAN కార్డ్ వివరాలు తెలుసుకొని.. ఒక నకిలీ ట్రేడింగ్ ప్లాట్ ఫామ్లో డాక్టర్ చేత రిజిస్ట్రేషన్ చేయించి బ్రిడ్జి క్యాపిటల్ అనే ఒక సంస్థలో పెట్టుబడులను పెట్టించాడు ఆ గుర్తు తెలియని వ్యక్తి.
మొదటగా రూ.20 వేలు చెల్లించి, క్రమక్రమంగా పెంచుకుంటూ ఏకంగా రూ.20.13 లక్షలు ఆమె చేత పెట్టుబడిగా పెట్టించారు. ఆ పెట్టుబడి సొమ్ము రూ.68.6.7 లక్షలు అయినట్లు ట్రేడింగ్ ప్లాట్ ఫామ్లో చూపించింది. ఇక వాటిని విత్ డ్రా చేసుకోవాలని డాక్టరమ్మ భావించింది. కానీ, విత్డ్రా చేసుకునే క్రమంలో ఇబ్బంది ఎదురైంది. అదేంటని ప్రశ్నిస్తే సైబర్ నేరగాళ్లు ఇంకా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని చెప్పడంతో మోసపోయానని తెలుసుకున్న వైద్యురాలు హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పలుమార్లు సూచించినా.. ఈ విధంగా ఉన్నత చదువులు చదువుకున్న వారు కూడా మోసపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని పోలీసులు చెప్తున్నారు.