ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకువస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ మేరకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకువచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రత్యేక సంస్కరణలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు వివరించారు. లెర్నింగ్ అవుట్ కమ్స్పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇందులో భాగంగా ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (ఎల్ఈఏపీ) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా విద్యాప్రమాణాల మెరుగుదలకు 9,600 మోడల్ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేశామని, వన్ క్లాస్ – వన్ టీచర్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 లీప్ స్కూళ్లను, 700 యూపీ స్కూళ్లను హైస్కూళ్లుగా అప్ గ్రేడ్ చేస్తున్నామన్నారు. అలాగే అకడమిక్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా అత్యుత్తమ పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇస్తున్నాని తెలిపారు. అలాగే ప్రత్యేక టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకువచ్చి సీనియారిటీ ప్రాతిపదికన ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు పూర్తి చేశామన్నారు.
తెలంగాణ పీఈసెట్లో 94 శాతం ఉత్తీర్ణత..
తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఎడ్), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఎడ్) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీఈసెట్ 2025 పలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల్లో మొత్తం 94.96 శాతం మంది విద్యార్ధులు అర్హత సాధించారు. పరీక్షల్లో భాగంగా పలు విభాగాల్లో క్రీడలు నిర్వహించారు. మొత్తం 2,557 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 1767 మంది క్రీడలకు హాజరయ్యారు. ఇందులో 1678 మంది అర్హత సాధించినట్లు కన్వీనర్ దిలీప్ తెలిపారు. బీపీఎడ్లో 1252 మంది, డీపీఎడ్లో 426 మంది ఉత్తీర్ణత పొందారు. ఇక డీపీఎడ్లో 300 సీట్లు, బీపీఎడ్లో 1660 సీట్లు అందుబాటులో ఉన్నాయి.