వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీనితో పాటుగా మరోక ద్రోణి కూడా విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజులు చెదురుమదురుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఇక విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం (జూన్ 27) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
తెలంగాణలో ఈదురు గాలులతో వానలు
వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా , పశ్చిమబెంగాల్ తీరంలో సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ మధ్య ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు, రేపు, ఎల్లుండి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
హిమాచల్ ప్రదేశ్ టొరెంటల్ వర్షం భీభత్సం.. ఇద్దరు మృతి!
హిమాచల్ ప్రదేశ్లో టొరెంటల్ వర్షం భీభత్సం సృష్టించింది. రుతుపవనాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించగానే కుండపోత వర్షాలు హిమాచల్ను అతలాకుతలం చేశాయి. పర్వత వాగులు, నదులు ఉప్పొంగి ఇళ్ళు, వాహనాలు కొట్టుకుపోయాయి. అనేక జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో ఖన్యారాలోని వాగు పక్కన ప్రైవేట్ ప్రాజెక్ట్ స్థలంలో తాత్కాలిక షెడ్లలో కార్మికులు బస చేస్తుండగా, అకస్మాత్తుగా వరద నీరు ముంచెత్తింది. దీంతో జలవిద్యుత్ ప్రాజెక్టు నుంచి దాదాపు 15 నుంచి 20 మంది కార్మికులు గల్లంతయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో ఇద్దరి మృత దేహాలను మనుని ఖాడ్ వాగు నుంచి రెస్క్యూ టీం వెలికి తీసింది. మిగతావారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఆకస్మిక వరదల దాటికి ఇళ్ళు నేలమట్టమయ్యాయి. రోడ్లు జలమయం అయ్యాయి. రోడ్లపై ఆపి ఉంచిన వాహనాలు సైతం వరద నీటిలో కొట్టుకుపోయాయి.