హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ, అతని సోదరుడు నవీన్ కుమార్ నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. రాజేంద్రనగర్తో పాటు చైతన్యనగర్ ప్రాంతాల్లోని శివ బాలకృష్ణ, అతని సోదరుడు నవీన్ కుమార్ నివాసాల్లో దాడులు చేసిన ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. ఏసీబీ నమోదు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.
శివ బాలకృష్ణకు రూ.250 కోట్ల మేర ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు గతంలో ఏసీబీ దాడుల్లో గుర్తించింది. 200 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ఇంటి స్థలాలు, విల్లా తదితర ఆస్తులు గుర్తించిన ఏసీబీ వీటి విలువ బహిరంగ మార్కెట్ లో రూ.250 కోట్లుంటుందని అంచనా వేసింది. ఇప్పటికే శివ బాలకృష్ణ అతని సోదరుడు నవీన్ను ఏసీబీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించింది. తాజాగా ఈడీ నిర్వహించిన దాడుల్లో శివ బాలకృష్ణ, అతని సోదరుడు నవీన్ కుమార్ నివాసాల్లో పలు దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు.
శివబాలకృష్ణ అడ్డదారుల్లో సంపాధించిన ఆస్తులకు బినామీలుగా వ్యవహరించిన ఆయన సమీప బంధువులైన ముగ్గురిని ఏసీబీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాజాగా శివబాలకృష్ణ అతడి సోదరుడి నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలోనే శివబాలకృష్ణ, ఆయన సోదరుడు శివనవీన్ అరెస్టు అయ్యారు. ఈ కేసులో భారీగా నగదు బదిలీలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఈడీ ఏసీబీ కేసు ఆధారంగా ఈసిఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. శివ బాలకృష్ణ ఇన్ని వందల కోట్లు ఎలా సంపాధించారన్న కోణంలో ఈడీ అధికారులు దృష్టి సారించారు.
మరోవైపు వందల కోట్లు విలువచేసే ఈ ఆస్తులను శివబాలకృష్ణ అక్రమంగా సంపాధించిన ఈడీ అనుమానం వ్యక్తం చేస్తుంది.ఇందుకు సంబంధించిన పలు పత్రాలను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలోనే త్వరలో శివబాలకృష్ణకు సంబంధించిన అక్రమ ఆస్తులను ఈడీ జప్తు చేసే అవకాశం ఉంది.