ఐదేళ్ల వయసులో రైలెక్కి వెళ్లిపోయాడో కుర్రాడు.. సీన్ కట్ చేస్తే 32 ఏళ్లకు తల్లిదండ్రుల ఆచూకీ వెతుక్కుంటూ సొంత ఊరికి తిరిగొచ్చాడు. అప్పటికే తల్లిదండ్రులు చనిపోయారని తెలిసి కన్నీరు పెట్టుకున్నాడు.. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ రియల్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్ట్లు ఉన్నాయి.
ఆదోని వెంకన్నపేటలో తండ్రి జనార్దన్, తల్లి, నానమ్మ రామాంజనమ్మతో కలిసి ఉండేవాడు వీరేష్. అయితే, తనకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆడుకుంటూ పొరపాటున రైలెక్కి తమిళనాడు రాజధాని చెన్నై వెళ్లానని చెబుతున్నాడు. అలా మూడేళ్ల వయసులో చెన్నై వెళ్లిన తనను రైల్వే పోలీసులు చేరదీశారని.. అక్కడే బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు. కొంతకాలానికి చెన్నై నుంచి ముంబై వెళ్లి చదువుకున్నాడు. అక్కడే ఒక రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు. అయితే మళ్లీ ఇన్నాళ్లకు తనది ఆదోని అని, తన తల్లిదండ్రులు, నాన్నమ్మ విషయం గుర్తుకొచ్చి సొంతూరుకు వచ్చాడు.
ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజను కలిసి తన తండ్రి పేరు జనార్ధన్, నాన్నమ్మ పేరు అంజనమ్మ అని తెలియచేసిన వివరాల మేరకు స్పందించిన అధికారులు వీరేష్ తల్లితండ్రుల ఆచూకీ గుర్తించారు. వీరేష్ తప్పిపోయినప్పుడు అతని తండ్రి కుటుంబం టైలరింగ్ చేసుకుంటూ ఆదోని గౌలి పేటలో ఉండేవారు. ప్రస్తుతం కర్నూలులో ఉన్నారని అధికారులు గుర్తించి వారికి సమాచారం చేరవేశారు. జిల్లా కలెక్టర్ సమక్షంలో వీరేష్ తన తల్లితండ్రులను కలుసుకుని కథ సుఖాంతం కావాల్సి ఉండగా ఇక్కడే అసలు ట్విస్ట్..
విధి ఆడిన ఆటలో వీరేష్ ఒంటరిగానే మిగిలాడు. తనను కలవడానికి తల్లితండ్రులు వస్తారనుకున్న వీరేష్కు తీవ్రనిరాశ తప్పలేదు. తన మేనత్త లక్ష్మీ భర్త జగదీష్ వచ్చి అధికారుల సమక్షంలో వీరేష్ను కలిశాడు. వీరేష్ తల్లి పద్మ కిడ్నీ సమస్యతో చనిపోయిందని.. వీరేష్ తప్పిపోయాక అతని కోసం వెతికి వెతికి దొరకలేదనే బెంగతో 1997లో తండ్రి జనార్ధన్, ఆ తర్వాత 2011లో నాన్నమ్మ అంజనమ్మ కూడా చనిపోయారని చెప్పడంతో కన్నీరు పెట్టుకున్నాడు వీరేష్. ప్రస్తుతం తన మేనత్త కుటుంబం మాత్రమే ఉంది.. దీంతో కుటుంబ సభ్యులను కలవాలని ఎంతో ఆశతో రాగా అందరూ చనిపోయారని తెలిసి వీరేష్ కథ విషాదంతో ముగిసింది.