మోస్ట్ వాంటెడ్ ధార్ గ్యాంగ్కు టెక్నో పోలీసింగ్ చెక్ పెట్టింది. అనంతపురంలో సంచలనం రేపిన భారీ చోరీ కేసును చేధించారు పోలీసులు.మధ్యప్రదేశ్లో మారుమూల పల్లెలను జల్లెడ పట్టి థార్ దొంగ ముఠాను అరెస్ట్ చేశారు. దాదాపు 2 కోట్ల సొత్తును రికవరీ చేశారు.
అనంతపురం శివారు రాజహంస స్వీట్ హోమ్స్లోని 3 విల్లాస్ లో జరిగిన శ్రీనగర్ కాలనీలో జరిగిన భారీ చోరీ కేసును ఛేధించారు పోలీసులు. జిల్లా ఎస్పీ జగదీశ్ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన స్పెషల్ టీమ్స్ మధ్యప్రదేశ్కు వెళ్లి మోస్ట్వాంటెడ్ ధార్ గ్యాంగ్కు చెక్ పెట్టారు. గ్యాంగ్ లీడర్ నారు పచావర్ సహా ముఠా సభ్యులు సావన్, సునీల్ ను అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి 90లక్షల విలువ చేసే నగలు, దాదాపు 20 లక్షల క్యాష్, బైకులను స్వాధీనంచేసుకున్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడులో ఈ ముఠాపై 32 కేసులున్నాయన్నారు ఎస్పీ జగదీష్. మధ్యప్రదేశ్లోని మారుమూల గ్రామాల్లో నక్కిన ఈ ముఠాను టెక్నాలజీ సాయంతో పట్టుకున్నామన్నారు. తాళం వేసిన ఇళ్లను లూటీ చేయడం ఈ ముఠా నైజమన్నారు.
ఈ గ్యాంగ్ దొంగతనాలు చేసేందుకు మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరి బెంగళూరు వచ్చి… బెంగళూరులో రెండు బైకులను దొంగతనం చేశారు. ఆతరువాత పెనుకొండ మీదుగా అనంతపురం చేరుకున్నారు. అనంతపురం శ్రీనగర్ కాలనీలో చోరీ చేశాక బైకులపై హైదరాబాద్కు వెళ్లి కొట్టేసిన సొత్తును పంచుకున్నారన్నారు. నిందితులను చాకచక్యంగా అరెస్ట్ చేసిన పోలీసులను అభినందించి రివార్డు అందించారు జిల్లా ఎస్పీ జగదీష్.నాలుగు రాష్ట్రాల పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన మధ్యప్రదేశ్ ధార్ గ్యాంగ్కు ఎట్టకేలకు చెక్ పెట్టారు అనంతపురం పోలీసులు.