ఏపీ సర్కార్ శ్రవణ, మౌన దివ్యాంగులకు ఒక కీలక సహాయం అందించబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల వారికి ఉచితంగా టచ్స్క్రీన్ మొబైల్ ఫోన్లు అందజేయనున్నట్టు ప్రత్యేక ప్రతిభావంతుల విభాగం అధికారి ఎ.డి.వి. కామరాజు ప్రకటించారు. అర్హతల విషయానికి వస్తే… కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు కావాలి. సైన్ లాంగ్వేజ్లో ప్రావీణ్యం ఉండాలి. కనీసం 40% పైబడిన వైకల్యం ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షల లోపుగా ఉండాలి. ఆసక్తి గల వారు తప్పనిసరిగా www.apdascac.ap.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆధార్ కార్డు, 10వ తరగతి, ఇంటర్ మార్కుల జాబితా, వైకల్యం ధ్రువీకరణ పత్రం, సైగల భాష సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం (ఎస్సీ/ఎస్టీ/బీసీ), ఆదాయ సర్టిఫికెట్, తెల్ల రేషన్ కార్డు కాపీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో సమర్పించాల్సి ఉంటుంది.
ఇతర దివ్యాంగులకు సహాయక పరికరాలు
ఇక 18 ఏళ్ల లోపు దివ్యాంగ బాలబాలికలకు సమగ్ర శిక్ష పథకం కింద అవసరమైన పరికరాలు అందజేయనున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 26వ తేదీతో పరీక్షలు పూర్తవుతాయి. ఇందుకోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, యూడీఐడీ కార్డు, వైకల్యం ధ్రువీకరణ పత్రం, రెండు పాస్పోర్ట్ ఫోటోలు ఇవ్వాల్సి ఉంటుంది. మూడు చక్రాల సైకిళ్లు, వీల్ఛైర్లు, వినికిడి యంత్రాలు, చంక కర్రలు, చూపు సమస్యలున్నవారికి ప్రత్యేక TLM కిట్లు, మానసిక దివ్యాంగులకు కూడా అనువైన TLM కిట్లు అందిస్తారు.