సీఎం చంద్రబాబు సర్క్యులర్ ఎకానమీ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శుభ్రత, పర్యావరణ సంరక్షణ లక్ష్యంగా రెండు నెలల్లో వ్యర్థాల నిర్వహణపై తుది పాలసీ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 2 నుంచి 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలుచేయాలని నిర్ణయించారు.
సర్క్యూలర్ ఎకానమీ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను పటిష్ఠ పరిచేలా రెండు నెలల్లో తుది పాలసీ రూపొందించాలని, వెంటనే అమలులోకి తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అమరావతి సచివాలయంలో సర్క్యులర్ ఎకానమీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు సీఎం. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈభేటీలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్వినియోగంపై రివ్యూలో ప్రధానంగా చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా శుభ్రత, పర్యావరణ సంరక్షణ విషయంలో అగ్రగామిగా నిలవడమే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
అక్టోబర్ 2 నుంచి 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేదించాలని అధికారులను సీఎం ఆదేశించారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో ఈ నిబంధన మొదట అమలు చేయాలని సూచించారు. 87 పట్ణణ ప్రాంతాల్లో 157 రెడ్యూస్-రీయూజ్-రీసైకిల్ సెంట్లర్ల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తొలి దశలో మూడు ప్రాంతాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కులు ఏడాదిలోగా ఏర్పాటు చేయాలని, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు తెచ్చే విధంగా వాటిని అభివృద్ధి చేయాలన్నారు.
అలాగే, వృథాగా పోతున్న ప్లాస్టిక్, ఇతర రీసైకిలబుల్ పదార్థాల నుంచి ఆదాయాన్ని సృష్టించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు సీఎం. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో లేటెస్ట్ మిషన్లను వినియోగాన్ని పెంచాలని సూచించారు. అంతేకాదు వేస్ట్ నిర్వహణలో ప్రతిభ చూపిన వారికి స్వచ్ఛత అవార్డులు ఇవ్వాలన్నారు సీఎం. మరోవైపు రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని.. 90 రోజుల్లోగా రీసైక్లింగ్, చెత్తను వేరు చేయాలని అధికారులను ఆదేశించారు. సర్క్యులర్ ఎకానమీ పార్కుల ఏర్పాటుపై మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలను పరిశీలించారు.