తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. మార్చి 3న ఫలితాలు వెల్లడించనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 3న ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 3 నుంచి 10 వరకూ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 11న స్క్రూటినీ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
నామినేషన్ ఉపసంహరణకు ఫిబ్రవరి 13 చివరి తేదీగా ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా, ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఫలితాలు వెల్లడించనున్నట్లు ప్రకటించింది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. కాగా, ఖాళీ కానున్న ఈ మూడు స్థానాలకు ప్రస్తుతం జీవన్ రెడ్డి, కూర రఘోత్తమ్ రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇక, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహించి మార్చి 3న ఓట్ల లెక్కింపు చేయనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. నోటిఫికేషన్ విడుదలైన తక్షణమే ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందని ఎలెక్షన్ కమిషన్ ప్రకటన జారీ చేసింది.
Amaravati News Navyandhra First Digital News Portal