రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్, డెంటల్ మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి ప్రకటన జారీ చేశారు. ఈ మేరకు జులై 22 నోటిఫికేషన్ విడుదల..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్, డెంటల్ మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి ప్రకటన జారీ చేశారు. ఈ మేరకు జులై 22 నోటిఫికేషన్ విడుదల చేశారు. నీట్ యూజీ 2025 ప్రవేశ పరీక్ష రాసి ర్యాంకులు సాధించిన అభ్యర్థులు బుధవారం (జులై 23వ తేదీ) నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ రోజు ఉదయం 9 నుంచి జులై 29న రాత్రి 9 గంటల వరకు అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకొని పూరించి పంపాలని సూచించింది. రూ.20 వేలు ఆలస్య రుసుముతో జులై 30వ తేదీ ఉదయం 7 నుంచి జులై 31న రాత్రి 9 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు.
విజయవాడ సిద్ధార్థ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 175 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇందులో 15 శాతం ఆల్ ఇండియా కోటా, 15 శాతం అన్రిజర్వుడు క్యాటగిరీకి కేటాయిస్తారు. మిగిలిన సీట్లను 65.62 శాతం ఆధ్రా పరిదికి, 34.38 శాతం సీట్లు ఎస్వీయూ పరిధికి కేటాయిస్తారు. నీట్ పరీక్షకు ఇంటర్మీడియట్ అర్హత కావడంతో 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు వరుసగా నాలుగేళ్లు స్థానికంగా చదివిన వారికి మాత్రమే లోకల్ క్యాటగిరీ కిందకు వస్తారని, ఆ అభ్యర్థులకు మాత్రమే లోకల్ కోటా కింద సీట్లు కేటాయించనున్నారు. ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క ఏడాది ఇతర రాష్ట్రాల్లో చదివినా లోకల్ కోటా కోల్పోనున్నారు.
రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు వైద్య కాలేజీలకు జాతీయ వైద్య కమిషన్ నుంచి అనుమతులు జారీ కాలేదు. దీంతో ఆయా మెడికల్ కాలేజీల్లో సీట్లు పెండింగ్లో ఉన్నాయి. వీటిల్లో విశాఖపట్నంలోని గాయత్రి విద్యా పరిషత్ కాలేజీ కూడా ఉంది. మరోవైపు మెడికల్ సీట్ల ఫీజుల మార్గదర్శకాలు కూడా విడుదల కావాల్సి ఉంది. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మార్గదర్శకాలపై ఏవైనా సందేహాలు ఉన్నవారు 89787-80501, 79977-10168 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు. సాంకేతిక సమస్యలు తలెత్తితే 90007-80707 నంబర్ను సంప్రదించాలని వర్సిటీ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.