ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ 2025 ఆన్లైన్ రాత పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి రోజుకు రెండు సెషన్ల చొప్పున జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పరీక్షలు కూడా పూర్తయ్యాయి. అయితే డీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పు చేస్తున్నట్లు తాజాగా రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. కూటమి సర్కార్ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో పలు డీఎస్సీ పరీక్షలను వాయిదా వేసింది. దీంతో జూన్ 20, 21 తేదీల్లో నిర్వహించవల్సిన అన్ని పరీక్షలను మార్పు చేసింది. ఈ పరీక్షలను జూలై 1, 2 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో డీఎస్సీ హాల్ టికెట్లలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పరీక్ష తేదీలతో పాటు, పరీక్షా కేంద్రాలు కూడా మారనున్నాయి. ఈ మార్పుల దృష్ట్యా డీఎస్సీ అభ్యర్ధులు హాల్ టికెట్లను మారో మారు డౌన్లోడ్ చేసుకోవాలని కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి సూచించారు. మారిన హాల్ టికెట్లు జూన్ 25 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన పరీక్షల్ని జులై 1, 2 తేదీల్లో నిర్వహించబోతున్నమాని, ఈ మేరకు అభ్యర్ధులు గ్రహించాలని ఆయన తెలిపారు. అయితే ఈ రెండు రోజులు మినహా మిగతా అన్ని పరీక్షలు యథాతథంగా షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని స్పష్టం చేశారు.
నిజానికి, తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు జూన్ 6వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు డీఎస్సీ ఆన్లైన్ రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రెండు రోజుల పాటు రాష్ట్రంలో యోగా కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ రెండు రోజుల పరీక్షలను రద్దు చేసింది. మరోవైపు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, యూజీసీ నెట్, టెట్, మెగా డీఎస్సీ పరీక్షల తేదీలు కూడా చాలా మందికి ఒకే తేదీల్లో వచ్చాయి. వీరంతా పరీక్షల తేదీలు మార్చాలని గత కొన్ని రోజులుగా ప్రభుత్వానికి విన్నవిస్తూనే ఉన్నారు. వీటిపై స్పందించని ప్రభుత్వం యోగా దినోత్సవానికి మాత్రం పరీక్ష తేదీలను మార్చింది..! అంటూ అభ్యర్ధులు ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పరీక్షల తేదీల్లో మార్పులు చేయాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో టెట్ పరీక్షలు ప్రారంభమైనాయి. అటు ఆర్ఆర్బీ, యూజీసీ నెట్ పరీక్షలు కూడా ఒకటి రెండు రోజుల్లో ప్రారంభంకానున్నాయి. చాలా మంది అభ్యర్ధులు ఈ నాలుగు పరీక్షలకు దరఖాస్తు చేసుకుని ఉన్నారు. ఏ ఒక్క పరీక్షకు హాజరైనా మిగిలిన మూడు పరీక్షలను నష్ట పోవల్సి ఉంటుంది.