ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ ఆన్లైన్ రాత పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి మొత్తం 154 పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 30వ తేదీ నాటికి ఈ పరీక్షలు పూర్తి కావల్సి ఉంది. అయితే జూన్ 20,21 తేదీల్లో నిర్వహించవల్సిన పరీక్షలను అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలను జులై 1, 2వ తేదీల్లో నిర్వహిచనున్నట్లు విద్యాశాఖ అప్పట్లో తెలిపింది. దీంతో మారిన ఈ రెండు రోజుల డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను తాజాగా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జూన్ 20, 21 తేదీల్లో జరగాల్సిన పరీక్షల తేదీలతోపాటు, పరీక్ష కేంద్రాలలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ రెండు తేదీల్లో పరీక్షలు ఉన్న విద్యార్ధులు మారిన కొత్త హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్ధులకు సూచించింది. ఈ మేరకు పరీక్షా కేంద్రాలు, పరీక్ష తేదీలు మార్చిన హాల్ టికెట్లు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
కాగా 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ చేపట్టారు. రోజుకు రెండు షిఫ్టుల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీకి 3,35,401 మంది 5,77,417 దరఖాస్తులు సమర్పించారు. ఇప్పటికే కొన్ని పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీలు వచ్చేశాయి. మొత్తం పరీక్షలు పూర్తయిన తర్వాత మరుసటి రోజున ప్రాథమిక ‘కీ’ విడుదల చేయనున్నారు. అభ్యంతరాల స్వీకరణకు వారం గడువు ఇచ్చి.. అనంతరం తుది ఆన్సర్ కీ విడుదల చేస్తారు.
జులై 3 నుంచి ICAR ఏఐఈఈఏ, ఏఐసీఈ పీజీ, పీహెచ్డీ పరీక్షలు.. వారంలో హాల్ టికెట్లు విడుదల
దేశ వ్యాప్తంగా ఉన్న పలు విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి వ్యవసాయ సంబంధ పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్- ఆలిండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్ (ఐకార్- ఏఐఈఈఏ (పీజీ), ఆలిండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్- జేఆర్ఎఫ్/ ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్డీ)-2025 పరీక్షలు జూలై 3న జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మరో వారంలో హాల్ టికెట్లు విడుదల చేయనుంది. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 74 వ్యవసాయ వర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. జులై 3న ఏఐఈఈఏ (పీజీ) ఉదయం షిఫ్టులో, ఏఐసీఈ-జేఆర్ఎఫ్/ఎస్ఆర్ఎఫ్ పీహెచ్డీ పరీక్షలు మధ్యాహ్నాం షిఫ్టులో ఆన్లైన్ విధానంలో జరగనున్నాయి.