ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 23) విడుదలవనున్నాయి. వీటితోపాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఫలితాలు కూడా బుధవారం విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయారామరాజు తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. పరీక్షలు రాసిన విద్యార్ధులు అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
అలాగే ‘మనమిత్ర’ (వాట్సాప్), లీప్ (ఎల్ఈఏపీ) మొబైల్ యాప్లోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు వాట్సాప్లో 9552300009 నంబర్కు ‘Hi’ అని మెసేజ్ పంపితే చాలు.. విద్యా సేవలను ఎంచుకుని, ఆపై ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, విద్యార్థి హాల్టికెట్ నంబర్ నమోదు చేసి ఫలితాలు పొందవచ్చు. అలాగే స్కూల్ ప్రిన్సిపల్స్ కూడా తమ పాఠశాల లాగిన్ ద్వారా విద్యార్ధుల మార్కులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం ఏప్రిల్ 3 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవగా ఏప్రిల్ 9వ తేదీతో ముగిసింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే ఏప్రిల్ 3 నుంచి 7 వరకు సార్వత్రిక విద్యాపీఠం పది, ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా మార్చి 17 నుంచి మార్చి 28 వరకు జరిగాయి.