ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. సిట్ అధికరుల సోదాల్లో ఏకంగా రూ.11 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. రంగారెడ్డి జిల్లా కాచారంలో ఏపీ సిట్ సోదాలు నిర్వహించింది. సులోచన ఫామ్హౌస్లో రూ.11 కోట్లు సీజ్ చేశారు సిట్ అధికారులు. A40 వరుణ్ ఇచ్చిన సమాచారంతో సిట్ దాడులు నిర్వహించింది. 12 బాక్సుల్లో నగదు దాచినట్టు గుర్తించారు. ఏ1 రాజ్ కేసిరెడ్డి ఆదేశాలతో నగదు దాచినట్టు వరుణ్, చాణక్య అంగీకరించినట్లు తెలుస్తోంది. 2024 జూన్లో నగదు ఫామ్హౌస్కు తరలించారు. ప్రొఫెసర్ తగల బాల్రెడ్డి పేరు మీద ఫామ్హౌస్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
లిక్కర్ స్కామ్ కేసులో దూకుడుగా ముందుకెళ్తున్నారు సిట్ అధికారులు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కీలక సోదాలు నిర్వహిస్తున్నారు. కేసులో ఇప్పటికే అరెస్టైన బాలాజీ గోవిందప్ప డైరెక్టర్గా ఉన్న భారతి సిమెంట్స్లో తనిఖీలు చేశారు. అటు A1 కేసిరెడ్డికి చెందిన రీసోర్స్ వన్ కంపెనీలో కూడా సిట్ అధికారులు సోదాలు చేశారు. ఇప్పటికే అరెస్టు అయిన చాణక్యకు చెందిన టీ గ్రిల్ రెస్టారెంట్ను కూడా అనువణువు పరిశీలించారు. నిందితులకు చెందిన సంస్థల్లో సోదాలు నిర్వహిస్తూనే… ఎవరెవరూ ఎక్కడెక్కడ సమావేశం అయ్యారు…? ఎన్నిసార్లు భేటీ అయ్యారనే అంశాలపై ఆరా తీస్తున్నారు.
మరీ ముఖ్యంగా భారతి సిమెంట్స్లో అణువణువు గాలించారు అధికారులు. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో పలు డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకుని స్టడీ చేస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కాం భారతి సిమెంట్స్ కేంద్రంగా నడిచిందని అనుమానాలు రావడంతో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా కాచారంలో రూ.11 కోట్ల నగదు పట్టుబడటం ఆసక్తిగా మారింది.
లిక్కర్ స్కామ్ కేసులో A47గా ఉన్న నెల్లూరుకు చెందిన ఆటో మొబైల్ ఇంజినీర్ షాజిల్ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈవీ రంగంలో పెట్టుబడుల కోసం కేసిరెడ్డే తనను సంప్రదించాడని సిట్ ముందు చెప్పారు. లిక్కర్ స్కామ్తో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు షాజిల్.
ఇక ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటినుంచి మరో లెక్క అని సంకేతాలు ఇచ్చారు జగన్. టీడీపీ రెడ్బుక్తో దూకుడు మీద ఉంటే, వైసీపీ మాత్రం వాళ్ల కేడర్ కోసం ఒక యాప్ తీసుకొస్తామంటోంది. లిక్కర్ కేసులో వైసీపీ నేతలు జైలుకు పోతారని టీడీపీ నేతలు హింట్ ఇస్తుంటే, అక్రమ కేసులను దీటుగా ఎదుర్కొంటామని విపక్ష పార్టీ కౌంటర్ ఇస్తోంది..