ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవలు మూడు రోజులుగా నిలిచిపోయాయి. రూ.2 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ వైద్యసేవ సీఈఓకి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు. వారంలోగా సమస్య పరిష్కరించాలని కోరారు.
ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేతకు బకాయిలు ఒక కారణం అయితే.. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ మరో కారణంగా తెలుస్తోంది. ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల చికిత్స ప్రతిపాదనతో.. స్కీమ్ తీసుకురాబోతుంది ఏపీ ప్రభుత్వం. అయితే కొత్త హైబ్రీడ్ విధానంలో తమనూ భాగస్వాములను చేయాలని, స్టేక్ హోల్డర్స్గా మార్చాలని ASHA ప్రతినిధులు అంటున్నారు . రూట్ మ్యాప్ ఇవ్వడంతో పాటు ఇన్సూరెన్స్ ప్యాకేజీ రేట్స్ తెలియజేయాలన్నారు.
తెలంగాణలో మంగళవారం (సెప్టెంబర్ 16) అర్థరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఆరోగ్యశ్రీ సీఈవోతో చర్చలు జరిగినా సమస్య పరిష్కారం కాలేదు. రూ.1,400 కోట్ల బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ ఆస్పత్రులు డిమాండ్ చేస్తున్నాయి. 10 శాతం బకాయిలు ఇస్తామని ప్రభుత్వం ప్రపోజల్ పెట్టినా.. సేవలు బంద్ వైపే మొగ్గు చూపాయి. మొత్తం బకాయిలు చెల్లించాలని నెట్ వర్క్ ఆస్పత్రులు డిమాండ్ చేస్తున్నాయి.
బకాయిలు ఇప్పటివి కావని, అయినా రాజకీయం చేస్తున్నారని మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014-15లో నెలకు రూ. 35 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు మంత్రి. 2024 నుంచి రూ. 90 కోట్లు ఇస్తూ వస్తున్నామని మంత్రి చెప్పారు. ఇప్పుడు నెలకు రూ. వంద కోట్లు ఇస్తామని చెప్తున్నా.. నెట్ వర్క్ ఆస్పత్రులు వినడం లేదని మంత్రి దామోదర తెలిపారు. నెలకు రూ. 500 కోట్లు ఇవ్వాలని నెట్వర్క్ ఆస్పత్రులు డిమాండ్ చేస్తున్నాయని, అది అసాధ్యమన్నారు.