హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ ద్వారా వచ్చింది. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, CISF, ఇతర భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. విమానాశ్రయాన్ని ఖాళీ చేసి, బాంబు నిర్మూలన బృందం తనిఖీలు చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉంది.
ఇటీవలె అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంతో.. ప్రజల్లో విమానం పేరు వింటేనే భయం కలుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్లోని బేగంపేట్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు వచ్చింది. మెయిల్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. దీంతో వెంటనే తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఎయిర్పోర్ట్ ఉద్యోగులు, సిబ్బందిని బయటికి తరలించారు.
స్నిఫ్ఫర్ డాగ్స్, బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ రంగంలోకి దింపి.. బాంబును వెతికిస్తున్నారు. ప్రస్తుతం జాగిలాలు, బాంబ్ ఎక్స్ ప్లోజివ్ ఎక్స్పర్ట్స్ ఎయిర్పోర్ట్ను అణువణువు గాలిస్తున్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఇప్పటికే అత్యవసర సహాయక సిబ్బందిని సైతం రప్పించారు. ఈ బెదిరింపు మెయిల్పై సైబర్ క్రైం అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. మెయిల్ పంపిన వాళ్ల క్రెడెన్షియల్స్ కనుగొనేందుకు కసరత్తు ప్రారంభించారు.