ఏపీలో విలీనం కారణంగా… భద్రాద్రి రాముడితో పాటు భద్రాచల వాసులకూ కష్టాలొచ్చి పడ్డాయి. రోజూ పేరుకుపోతున్న చెత్తను ఎక్కడ డంప్ చేయాలో అర్ధంకాక తలలు పట్టుకుంటున్నారు అధికారులు. ఎందుకంటే భద్రాచలం పట్టణం చుట్టూ ఉన్న నాలుగు రెవెన్యూ గ్రామాలతో పాటు ఒక పంచాయతీని ఏపీలో విలీనం చేశారు.
భద్రాచలం పట్టణాన్ని మాత్రమే తెలంగాణలో ఉంచి, చుట్టుపక్కల ప్రాంతాలను ఏపీలో కలిపారు. అలా ఏపీలో కలిపిన ప్రాంతాల్లో ఒకటే పురుషోత్తపట్నం.. అసలు అలజడంతా జరుగుతున్నదీ అక్కడే. రెండేళ్ల క్రితం.. సరిగ్గా చెప్పాలంటే 2023 అక్టోబర్లో భద్రాచలం ఆలయ అధికారులను కర్రలతో వెంటబడి కొట్టారు పురుషోత్తపట్నంలోని కబ్జాదారులు. కొన్ని నెలల గ్యాప్ తరువాత 2024 ఆగస్ట్ 16న ఏకంగా ఆలయ ఈవో వెళ్లారు పురుషోత్తపట్నానికి. దాదాపుగా కొట్టినంత పని చేశారు. ఈ జులై 8న పురుషోత్తపట్నం వెళ్లిన ఈవోను ఈసారి వదల్లేదు. ఆస్పత్రిపాలు చేశారు. ఎందుకని పురుషోత్తపట్నంలోనే ఇదంతా జరుగుతోంది? ఈ ఒక్క ఊరు.. రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని ఎలా రాజేస్తోంది? పచ్చిగా చెప్పుకోవాలంటే.. విభజన తరువాత ఎవరికైనా నష్టమంటూ జరిగిందంటే అది భద్రాద్రి రాముడికే. బహిరంగంగా అంగీకరించదు గానీ… ఏపీ సర్కార్కు కూడా తెలుసు ఈ విషయం. భద్రాచలం రెవెన్యూ విలేజ్ మినహా.. చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ ఏపీలో కలిపారు. అప్పటి నుంచి మొదలయ్యాయి భద్రాచలం కష్టాలు. దాదాపు 2వేల ఎకరాల్లో ఉండే భద్రాచలంలో అటుఇటుగా 80వేల మంది నివసిస్తున్నారు. పైగా.. ఖమ్మం జిల్లాకు ఏటా కోటి మంది పర్యాటకులు వస్తుంటారు. అందులో 40 లక్షల మంది కేవలం రాములవారిని దర్శించుకునేందుకే వస్తుంటారు. భవిష్యత్తులో జనాభా పెరుగుతుంటే, వచ్చే భక్తుల సంఖ్యా పెరుగుతుంది. కాని, ఇంతమందికి నిలువ నీడచ్చే స్థలమే లేదు భద్రాచలంలో. ఒకప్పుడు ఆ రాముడికి నీడ లేనందుకే భద్రాద్రిపై గుడిని కట్టాడా…