ఆరేళ్ల క్రితం కొడుకు.. ఇప్పుడు తండ్రి.. సేమ్ టూ సేమ్.. దుండగుల కాల్పులకు బలయ్యారు. బిహార్లో పాట్నాలో జరిగిన కాల్పుల సంఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. బీజేపీ నేత, పారిశ్రామిక వేత్త గోపాల్ ఖేమ్కాను శుక్రవారం అర్థరాత్రి దుండగుడు కాల్చిచంపాడు.. కాల్పుల అనంతరం దుండగుడు బైక్పై పారిపోయాడు.. గుర్తుతెలియని దుండగుడు.. ఖేమ్కా ఇంటి పక్కనే ఉన్న హోటల్ ముందు ఉండగా.. కాల్పులు జరిపాడని.. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి మరణించారని పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి.. ఖేమ్కా ఇంటికి వెళ్తుండగా గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ‘పనాచే’ హోటల్ సమీపంలో ఈ సంఘటన జరిగింది.
ఖేమ్కా హోటల్ పక్కనే ఉన్న ‘ట్విన్ టవర్’ సొసైటీలో నివసిస్తున్నారు.. అతను తన నివాసానికి దగ్గరగా ఉన్న ఒక అపార్ట్మెంట్ దగ్గర తన కారు దిగగానే నిందితుడు అతనిపై కాల్పులు జరిపి వెంటనే పారిపోయాడు. దీంతో గోపాల్ ఖేమ్కా అక్కడికక్కడే మరణించాడని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలోని పురాతన ప్రైవేట్ ఆసుపత్రులలో ఒకటైన మగధ్ ఆసుపత్రికి ఖేమ్కా యజమాని.. నేరస్థలం నుండి పోలీసులు ఒక బుల్లెట్, షెల్ కేసింగ్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. గోపాల్ ఖేమ్కా మృతిపై బీహార్ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది.. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
“జూలై 4 రాత్రి 11 గంటల ప్రాంతంలో, గాంధీ మైదాన్ దక్షిణ ప్రాంతంలో వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా కాల్చి చంపబడ్డారని మాకు సమాచారం అందింది… నేరస్థలానికి చేరుకుని పరిశీలించాం.. భద్రతను కట్టుదిట్టం చేశారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది… ఒక బుల్లెట్ మరియు ఒక షెల్ స్వాధీనం చేసుకున్నారు…” అని సిటీ ఎస్పీ సెంట్రల్, దీక్ష ANI కి తెలిపారు.
వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్య కేసుపై బీహార్ పోలీసులు ఒక సిట్ను ఏర్పాటు చేశారని, ఈ సిట్కు ఎస్పీ సిటీ సెంట్రల్ నేతృత్వం వహిస్తారని డీజీపీ వినయ్ కుమార్ తెలిపారు.
బిహార్లో కొన్ని నెలల్లో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో .. బీజేపీ నేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త గోపాల్ ఖేమ్కా దారుణ హత్య రాజకీయ దుమారం రేపుతోంది. అయితే.. గోపాల్ ఖేమ్కా కుమారుడు గుంజన్ కూడా ఆరేళ్ల క్రితం ఇదేవిధంగా హత్యకు గురయ్యాడు. 2018లో వైశాలి ప్రాంతంలోని తన ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తుండగా గుంజన్ను బైక్పై వచ్చిన దుండగులు కాల్చి చంపారు. అప్పుడు కొడుకు.. ఇప్పుడు తండ్రి దుండగుల కాల్పులకు బలవ్వడం సంచలనంగా మారింది.