కాలయముడుగా మారిన కేర్ టేకర్.. నమ్మి అప్పజెప్పినందుకు గొంతు కోసి పరార్

టెంపుల్ సిటీ తిరుపతిలో దారుణం వెలుగు చూసింది. ఒక వృద్ధురాలి హత్య సంచలనంగా మారింది. కేవలం 8 గ్రాముల బంగారు కమ్మలపై కన్నేసిన కేర్ టేకర్ దురాశ.. 73 ఏళ్ల ధనలక్ష్మి హత్యకు కారణం అయ్యింది. ఇంట్లో మంచంపై పడుకుని ఉన్న ధనలక్ష్మి గొంతు కోసి హత్య చేసేంత దుర్మార్గానికి కేర్ టేకర్ ఒడిగట్టిన పరిస్థితి దాపురించింది. పవిత్ర ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఈ ఘోరం జరిగింది.

రేణిగుంట రోడ్డులోని సీపీఐర్ విల్లాస్ లో ఈ ఘటన జరిగింది. పక్షవాతంతో బాధపడుతున్న తండ్రి షణ్ముగంకు కేర్ టేకర్ గా రవిని అనే వ్యక్తిని పెట్టాడు కొడుకు శివ ఆనంద్. ఇంట్లో మేనత్త ధనలక్ష్మి కూడా ఉంది. వర్క్ ఫ్రం హోం పని చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శివ ఆనంద్ మీటింగ్ కోసం హైదరాబాద్ వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన కేర్ టేకర్ హంతకుడిగా మారాడు. పక్షవాతంతో నడవలేని లేవలేని పరిస్థితుల్లో ఉన్న షణ్ముగం పడుకుని ఉన్నాడు. హాల్‌లో దివాన్ పై ధనలక్ష్మి నిద్ర పోయింది. ఇంట్లో శివ ఆనంద్ లేకపోవడం అనువుగా భావించిన కేర్ టేకర్ రవి అనుకున్న ప్లాన్ ను అమలు చేశాడు. ధనలక్ష్మి గొంతు కోసి ఆమె చెవులకు ఉన్న 8 గ్రాముల బంగారు కమ్మలు ఎత్తుకెళ్లాడు కేర్ టేకర్ రవి.

తండ్రి పక్షపాతంతో బాధపడుతుండడం ఆయన ఆలనా పాలనా చూసుకునేందుకు కొడుకు శివ ఆనంద్ కేర్ టేకర్ ను నియమించుకున్నాడు. ఒక ఏజెన్సీ ద్వారా తిరుపూర్‌కు చెందిన రవిని ఏడాది క్రితం కేర్ టేకర్ గా పెట్టుకున్న శివ ఆనంద్.. ప్రతినెల ఏజెన్సీకి రూ. 25 వేలు చెల్లిస్తూ వస్తున్నాడు. అయితే ఏజెన్సీ మాత్రం కేర్ టేకర్ కు కమిషన్ పట్టుకుని ప్రతి నెల రూ.15 వేలు మాత్రమే చెల్లిస్తుంది. దీంతో జీతం చాలదని రవి మానేశాడు. తిరిగి రవిని ఏజెన్సీ ద్వారా కాకుండా కేర్ టేకర్ గా డైరెక్ట్ గానే నియమించుకున్న శివ ఆనంద్.. ప్రతి నెల రూ. 22 వేలు జీతం కూడా చెల్లిస్తూ వచ్చాడు. రవి కూడా ఇంట్లో నమ్మకస్తుడిగా పక్షవాతంతో బాధపడుతున్న షణ్ముఖంకు సపర్యలు చేస్తూ మెలిగాడు.

కేర్ టేకర్ రవిపై ఎలాంటి అనుమానం లేకుండా ఇంట్లో మనిషిగా చూసుకున్నాడు శివ ఆనంద్. ఇంతలోఉద్యోగరీత్యా హైదరాబాద్ కు వెళ్లాల్సి వచ్చింది. ఈ మేరకు శుక్రవారం(ఆగస్టు 22) హైదరాబాద్ వెళ్లిన శివ ఆనంద్ కు షాక్ ఇచ్చాడు కేర్ టేకర్ రవి. శివ ఆనంద్ మేనత్త ధనలక్ష్మి వద్ద ఉన్న ఎనిమిది గ్రాముల బంగారు కమ్మలను కాజేసేందుకు ఏకంగా ఆమె గొంతునే కోసి చంపేశాడు. రక్తపు మడుగులో ధనలక్ష్మి మృతి చెందగా ఆమె చెవులకు ఉన్న బంగారు కమ్మలను కాజేసి రవి పరార్ అయ్యాడు. విషయం పోలీసుల దాకా వెళ్ళింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా కేర్ టేకర్ ను హంతకుడిగా తేల్చారు. పరారీలో ఉన్న కేర్ టేకర్ రవి కోసం గాలిస్తున్న పోలీసులు, ధనలక్ష్మి హత్య కేసులో నిజాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

About Kadam

Check Also

ఆ విశ్వవిద్యాలయం విధుల్లో కొత్త సెక్యూరిటీ గార్డు.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. !

అది 2002 సంవత్సరం… ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున కోతుల గుంపు తిరుగుతుండేది. చుట్టూ పక్కల అంతా వ్యవసాయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *