ఆపదమొక్కుల వాడు, కోరిన కోరికలు తీర్చే వెంకన్న స్వామికి భక్తులు నిత్యం విరాళాలు అందజేస్తూ ఉంటారు. కొందరు బంగారు నగలు విరాళంగా సమర్పించుకుంటే మరికొందరు డబ్బును విరాళంగా ఇస్తుంటారు. తాజాగా చెన్నైకి చెందిన స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ సీఈవో గణేష్ మణి, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వెంకటరమణ్ తిరుమల తిరుపతి దేవస్తానానికి ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా ఇచ్చారు. బుధవారం కంపెనీ పతినిధులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ సీఈవో గణేష్. అనంతరం రూ.1.33 కోట్ల విలువైన విద్యుత్ బస్సును టీటీడీరి అందజేశారు.
ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట కొత్త ఎలక్ట్రిక్ బస్సు తాళాలను టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి అందించారు. ఈ కార్యక్రమంలో స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ సీఈవో గణేష్ మణి, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వెంకటరమణ్ శ్రీవారి ఆలయ పేష్కార్ రామక్రిష్ణ, తిరుమల డీఐ వెంకటాద్రి నాయుడు పాల్గొన్నారు.
మరోవైపు బుధవారం శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా పొటెత్తారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనాకికి 8 గంటల సమయం పడుతుంది. ఇదిలా ఉండగా నిన్న స్వామివారిని 64,925 మంది భక్తులు దర్శించుకోగా 21,338 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీకి రూ. 3.90 కోట్లు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.