హైదరాబాద్ ప్రజలకు బీ అలెర్ట్.. మీ పిల్లలు జాగ్రత్త. నగరంలో చిన్నారుల్ని కిడ్నాప్ చేస్తూ టెన్షన్ పుట్టించిన ఓ ముఠా చివరకు పోలీసుల చేతికి చిక్కింది. పిల్లలను ఎత్తుకుపోయి వారిని విక్రయించేందుకు యత్నించిన ఈ ముఠాలో నలుగురిని చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై మాదాపూర్ డీసీపీ వినీత్ మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ ముఠా సభ్యులు ఇంట్లో పెద్దలు లేని సమయాల్లో పిల్లలను టార్గెట్ చేస్తున్నారని, రెక్కీ చేసి చిన్నారులను అపహరిస్తున్నారని తెలిపారు.
ఆగస్టు 25న లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఏడాదిన్నర వయసున్న చిన్నారిని ఈ ముఠా సభ్యులు కిడ్నాప్ చేశారు. కాచిగూడలో ఐదేళ్ల బాలికను, లింగంపల్లిలో మరో బాలికను కూడా ఎత్తుకుపోయారు. గత ఏడాది కూడా ఐదేళ్ల బాబును కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మొత్తం నలుగురు చిన్నారులను(ఇద్దరు బాలికలు, ఇద్దరు బాలురు) రెస్క్యూ చేశారు. .
పిల్లలను ఎత్తుకెళ్లింది దత్తత పేరుతోనా? లేక ఇతర ప్రాంతాలకు విక్రయం చేయాలనే ఇంటెన్షనా.. అన్నదానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనక పెద్ద ముఠా ఉందా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నాయి. ఇటీవల మీ బంధువుల్లో, పరిచయస్తుల్లో ఎవరైనా చిన్నారులు కనిపించకుండా పోయి ఉంటే, తక్షణమే మీ స్థానిక పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని పోలీసులు సూచించారు. పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు.