వివాదాస్పద కొటియా గ్రామాలపై చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఏళ్ల తరబడి నానుతూ వస్తున్న సమస్యకు పరిష్కారం దిశగా అడుగులేస్తోంది. అయితే ఏపీ విజ్ఞప్తితో కేంద్రం చొరవ చూపుతుందా? పట్టువిడిచేలా ఒడిశాను ఒప్పిస్తుందా? అసలు గిరిజన గూడేలా గోడేంటి? ఆ వివరాలు ఇలా
ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో కొటియా గ్రామాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మధ్య కొటియా గ్రామాల్లో అభివృద్ధి పనులను ఒడిశా అడ్డుకుంది. ఈ సమస్య మళ్లీ పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో.. మంత్రి గుమ్మడి సంధ్యారాణి మ్యాటర్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఒడిశా ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తున్నారు చంద్రబాబు.
కొటియా గ్రామాలు… కొండలపై ప్రశాంతంగా కొలువుదీరిన గిరిశిఖర గ్రామాలు.. నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాంతాలు.. విజయనగరం జిల్లా సాలూరు నుంచి సరిగ్గా 50 కిలోమీటర్ల దూరం. నగరం నుంచి దూరంగా విసిరి వేయబడినట్టుండే గిరిజన గూడేలు. ఈ గ్రామాల కోసమే ఒడిశా పట్టుబడుతోంది.. వీటిని ఎలాగైన సొంతం చేసుకోవాలని ఆరాటపడుతోంది. సరిహద్దులు దాటొచ్చి ఏపీలోకి చొచ్చుకొచ్చి ఈ 21 గ్రామాలపై తన అధికారాన్ని బలవంతంగా రుద్దుతోంది. అభివృద్ధి పేరుతో దురాక్రమణ చేస్తోంది. ఏపీ చేపట్టే అభివృద్ధి పనులను అడ్డుకుంటుంది. కొటియా గ్రామస్తులందరికీ.. ఒడిశా ప్రభుత్వం రేషన్ కార్డులు, ఓటరు కార్డులిచ్చింది. వాళ్లకి అక్కడి ప్రభుత్వ పథకాలన్నీ అందుతున్నాయి. విచిత్రం ఏంటంటే.. అక్కడి వాళ్లంతా ఏపీ ప్రజలు. వాళ్లకి ఏపీ రేషన్ కార్డులు, ఓటరు కార్డులు కూడా ఉన్నాయి. ఏపీ సంక్షేమ పథకాలన్నీ ఇక్కడ అమలవుతున్నాయి. ఇటు ఏపీ, అటు ఒడిశా.. రెండు రాష్ట్రాలూ… కొటియా గ్రామాలు తమవంటే తమవని క్లైయిమ్ చేసుకుంటున్నాయి.
బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో సర్వే చేయగా.. 101 గ్రామాలు సమస్యాత్మకంగా ఉన్నట్టు గుర్తించాయి. తర్వాత ఇందులో 79 గ్రామాలు ఒడిశాలో విలీనం అయినప్పటికీ.. 22 గ్రామాల సంగతి మాత్రం ఎటూ తేల్చలేకపోయారు. ఒడిశా, ఏపీ రాష్ట్రాలుగా అవతరించాక కూడా సమస్య అలాగే ఉంటూ వచ్చింది. సమస్య సుప్రీంకోర్టుకు చేరినా పరిష్కారానికి నోచుకోలేకుండా పోయింది. కొటియా గ్రామాల సమస్యకు ఎండ్కార్డ్ వేయాలన్న పట్టుదలతో ఉన్నారు సీఎం చంద్రబాబు. రెండుచోట్ల ఎన్డీఏ ప్రభుత్వం ఉండటంతో చర్చలతో పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావంతో ఉన్నారు. లేదంటే మ్యాటర్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్న భావిస్తున్నారట.