అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో గంజాయి సాగుపై పోలీసులు ప్రత్యేక డ్రోన్లతో నిఘా పెట్టారు. కొండలు, గుట్టలు, లోయల మాటున దాగి ఉన్న గంజాయి సాగును గుర్తించేందుకు డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. రంగంలోకి స్వయంగా పాడేరు ఎస్పీ అమిత్ బర్దార్ దిగి.. కొండల మాటున లోయల్లో గంజాయి సాగు జరిగుతున్నట్టు గుర్తించి.. మూల గంజాయి పంట సాగు జరిగినా దాన్ని ధ్వంసం చేసే విధంగా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. తాజాగా అరకులోయ అడవి ప్రాంతంలో గంజాయి సాగుపై సర్వే నిర్వహించారు. డుంబ్రిగూడ మండలం కించమండ పరిధి గ్రామాల్లో డ్రోన్ల చక్కర్లు కొట్టాయి. కొండలు మారుమూల ప్రాంతాల్లో నిఘా పెంచారు పోలీసులు. సుమారు 10 గ్రామాల పరిసర ప్రాంతాల్లో సర్వే చేశారు. గతంలో జి మడుగుల మండలం డేగలరాయిలో గంజాయి ఐదు ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి తోటలను పోలీసులు గుర్తించారు. రెవెన్యూ ఫారెస్ట్ అధికారుల సహకారంతో ఆ మొత్తాన్ని పోలీసులు ధ్వంసం చేశారు.
పాడేరు, జి మాడుగుల, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో అధునాతమైన డ్రోన్లు సహాయంతో నిఘాపెంచారు. నాలుగు ప్రత్యేక డ్రోన్లతో అదేపనిగా అడవిని జల్లెడ పడుతున్నారు. గంజాయిని ధ్వంసం చేయడమే కాదు.. వాటికి దూరంగా ఉండాలని పదేపదే చెబుతున్న మళ్ళీ మళ్ళీ సాగు చేస్తున్న వారిని జి మడుగుల మండలం డేగలరాయలు లో గతంలో అరెస్ట్ లు కూడా చేశారు.
స్వయంగా ఎస్పీ స్థాయి అధికారి ఈ గంజాయి పర్యవేక్షిస్తున్నారు. నాలుగు అధునాతన డ్రోన్ ను రంగంలోకి దింపారు. వాటిని ప్రత్యేక శిక్షణ తీసుకున్న వారితో ఆపరేట్ చేయిస్తున్నారు. పోలీసుల ఆపరేషన్తో మరి కొంతమంది స్వచ్ఛందంగా గంజాయి తోటలను తొలగిస్తున్నారు. జి మాడుగుల పరిసర ప్రాంతాల్లో గంజాయి తొటలను ధ్వంసం చేస్తున్నారు.
ఏపీ సర్కార్ డ్రోన్ల టెక్నాలజీ పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే కీలక కార్యకలాపాల కోసం డ్రోన్లను వినియోగిస్తోంది. అయితే ఇప్పటికే డ్రోన్లతో ఏజెన్సీలో గంజాయి ధ్వంసం చేసిన పోలీసులు.. ఇక గవర్నమెంట్ డైరెక్షన్స్ తో ఏజెన్సీ నుంచి సమూలంగా గంజాయిని తొలగించే పనికి డ్రోన్లతో శ్రీకారం చుట్టారు. గంజాయి సాగే కాదు.. గుట్టుగా గంజాయి రవాణా చేస్తున్న స్మగ్లర్ల పైన డ్రోన్లతో నిఘా పెడుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో గంజాయి అనే పదం వినపడకుండా చేయాలని ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.