రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐఐటీ, నీట్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇంజినీరింగ్, మెడిసిన్లో సీట్లు సాధించిన ఎస్సీ గురుకుల విద్యార్థులకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి శుభవార్త చెప్పారు. ఆయా విద్యార్ధులకు ప్రోత్సాహకంగా రూ.లక్ష చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం అందించాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని కార్యాలయంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పాలకమండలి సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు.
గురుకుల విద్యార్థులకు 11 కాస్మొటిక్ వస్తువులను కిట్ రూపంలో అందించాలని అధికారులకు తెలిపారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన 7 ఐఐటీ, నీట్ శిక్షణ కేంద్రాల్లో డిప్యుటేషన్పై అధ్యాపకులను నియమించాలనే నిర్ణయానికి పాలకమండలి ఆమోదం తెలిపింది. గురుకులాల్లో మిగిలిపోయిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని కూడా ఆయన తెలిపారు. మరోవైపు ఐఐటీ, నీట్లో కొద్దిలో సీటు కోల్పోయిన 120 మంది విద్యార్థులకు లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రతి గురుకుల పాఠశాలలో వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. వినుకొండ గురుకుల విద్యార్థిని సంకీర్తన ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. విద్యార్ధిని కుటుంబానికి సాంత్వన పథకం కింద రూ.3 లక్షల చెక్కును మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అందించారు.
నేటితో ముగుస్తున్న ఈఏపీసెట్ వెబ్ ఆప్షన్లకు తుది గడువు
తెలంగాణ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్కు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నేటితో ముగియనుందని ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు. జులై 10 వరకు 74,542 మంది వెబ్ఆప్షన్లు పెట్టుకున్నారని ఆమె పేర్కొన్నారు. జులై 13లోపు మాక్ సీట్ల కేటాయింపు ఉంటుందని, ఆ తర్వాత విద్యార్థులు రెండు రోజులపాటు వెబ్ ఆప్షన్లు మార్చుకోవడానికి అవకాశం ఇస్తామని అన్నారు.