మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు.. రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీలో చేరేందుకు ఇప్పటికే లైన్ క్లియర్ విశ్వసనీయ సమాచారం అందుతోంది. బీజేపీ అగ్రనేతలతో ఇప్పటికే మంతనాలు కూడా జరుగుతున్నాయి. తాను రాజీనామా చేసిన రాజ్యసభ సీటు కాకుండా మరో పదవిపై విజయసాయిరెడ్డి దృష్టి పెట్టారు. ఏపీ రాజ్యసభ రేసులో లేనని ఇప్పటికే ప్రకటించిన విజయసాయిరెడ్డి.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.. విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీలోకి చేరేందుకు సిద్ధమయ్యారని పేర్కొంటున్నారు ఆయన అనుచరులు.. ఈ మేరకు ఇప్పటికే మంతనాలు కూడా పూర్తయినట్లు చెబుతున్నారు.
ఈ క్రమంలో బీజేపీలో విజయసాయిరెడ్డి పాత్రపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. బీజేపీలోకి వెళ్తే ఎలా ఉంటుందనే దానిపై ఇప్పటికే అనుచరులతో విజయసాయి మంతనాలు జరుపుతున్నారు. బీజేపీలో చేరితే రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలని సన్నిహితుల నుంచి సూచనలు అందుతున్నాయి. అయితే జాతీయస్థాయిలో ఉండేందుకే విజయసాయిరెడ్డి మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలాఉంటే.. రాజకీయాల్లోకి రావాలంటే ఎవరి అనుమతి.. అవసరం లేదని.. వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం విజయసాయిరెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి మళ్లీ వస్తానంటూ ఇటీవలే ప్రకటన చేశారు. తనను పార్టీనే దూరం చేసుకుందంటూ వైసీపీ నాయకత్వంపై విజయసాయిరెడ్డి అసహనంతో ఉన్నట్లు పేర్కొంటున్నారు.