విజయవాడలో బడ్డీ కొట్లలో అమ్ముతున్న చాక్లెట్లను.. పిల్లలు తెగ తింటున్నారు. అవే కొనిపెట్టాలని తల్లిదండ్రుల వద్ద మారాం చేస్తున్నారు. స్కూళ్లకు సమీపంలోని బడ్డీ కొట్లలో కూడా వీటిని విక్రయిస్తున్నారు. ఈ విషయం గురించి సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా.. విస్మయకర విషయాలు వెలుగుచూశాయి.
విజయవాడలో ఉంటున్న పిల్లల తల్లిదండ్రులూ జాగ్రత్తగా ఉండాలి. ఆ మాటకొస్తే ఏ ప్రాంతంలోని తల్లిదండ్రులు అయినా పిల్లలు విషయంలో ఇప్పుడు అలెర్ట్ అవ్వాల్సిన సమయం. ఇప్పుడు మీకు చెప్పబోయే న్యూస్ ఏమాత్రం లైట్ తీసుకోకండి. విజయవాడలో ఈగల్ టీమ్ తనిఖీల్లో విస్తుబోయే నిజాలు వెలుగుచూశాయి. బడ్డీ కొట్లలో భారీ ఎత్తున గంజాయి చాక్లెట్లు సీజ్ చేశారు అధికారులు. వన్ టౌన్లో 110 ప్యాకెట్లలో గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ప్యాకెట్లో 4వందల గంజాయి చాక్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. బడ్డీ కొట్ల నుంచి కిరాణాషాప్ల దాకా ఇవే చాక్లెట్ల అమ్మతున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. దీంతో అల్టైన ఈగల్ టీమ్, టాస్క్ఫోర్స్ నగరవ్యాప్తంగా సోదాలు మొదలుపెట్టింటి.
గంజాయికి పిల్లల్ని బానిసలు చెయ్యడమే వీరి లక్ష్యం. ఒక్కసారి చాక్లెట్ల రూపంలో బానిసలైతే తర్వాత ఏకంగా గంజాయి వాడకం మొదలుపెడతారాన్న పెద్ద కుట్రే కనిపిస్తోంది. ప్రధానంగా పిల్లలు స్కూళ్లకు వెళ్లే దారులు, స్కూళ్ల దగ్గర కూడా చాక్లెట్ల విక్రయం జోరుగా ఉన్నట్లు అనుమానం. అసలు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి. సప్లయర్ ఎవరు.. సిటీలో ఎన్ని షాపులకు సప్లై చేస్తున్నారన్న కోణంలో ప్రస్తుతం పోలీసుల విచారణ జరుగుతోంది. గంజాయిని పూర్తిగా కట్టడి చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భావిస్తుంటే.. ఇలాంటి చాక్లెట్ల రూపంలో పిల్లలకు కూడా అందుబాటులోకి రావడం విస్మయానికి గురిచేస్తోంది. దీనిపై సెపరేట్ యాక్షన్ ప్లాన్ రూపొందించాల్సి ఉంది.