ఆంధ్రుల కల సాకారం కాబోతోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో పనులు ప్రారంభంకానున్నాయి. మూడేళ్లలో అమరావతిని పూర్తిచేసి ది బెస్ట్ కాపిటల్ సిటీగా తీర్చిదిద్దామని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది . మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేస్తామంటోంది కూటమి ప్రభుత్వం. అమరావతి నిర్మాణ పనులు వచ్చేనెలలోనే ప్రారంభం కానున్నాయి. అన్నిరకాల పనులకు ఇప్పటికే నిధులను సమకూర్చామంటోంది సర్కార్.
రాజధాని అమరావతి టెండర్ల ప్రక్రియను నెలాఖరులోపు పూర్తిచేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 40 పనులకు టెండర్లు పూర్తి చేస్తామని అన్నారు. ఫిబ్రవరి రెండో వారంలోనే క్యాపిటల్ సిటీ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు.
రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి.. హైకోర్టు రాఫ్ట్ ఫౌండేషన్ దగ్గర నీట పంపింగ్ను, నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లను పరిశీలించారు. ఏపీ అసెంబ్లీని 250 మీటర్ల ఎత్తులో నిర్మించి.. మిగిలిన రోజుల్లో టూరిజం స్పాట్గా మార్చాలని డిజైన్లు రూపొందించామని మంత్రి తెలిపారు. రాష్ట్ర స్థాయి అధికారులందరూ ఒకేచోట ఉండేలా 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్లు డిజైన్ చేశామని మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతి పనుల్లో రాజీ పడేదిలేదన్న మంత్రి.. ఏపీ రాజధానిని ప్రపంచంలో టాప్-5లో ఒకటిగా నిలుపుతామని స్పష్టం చేశారు.